. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పరిహారం కోసం రూ.2 వేల కోట్లు కేటాయించాలి
. ఆర్థిక మంత్రి కేశవ్కు రామకృష్ణ వినతి
విశాలాంధ్ర-విజయవాడ: ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం కోసం రానున్న బడ్జెట్లో రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టుకు నికరజలాలు సైతం కేటాయించాలన్నారు. ఈ మేరకు రామకృష్ణ నేతృత్వంలోని సీపీఐ బృందం మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అత్యంత ప్రధానమైనది అన్నారు. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతూ, కరువుతో అల్లాడుతున్న ప్రకాశంజిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు వరదాయిని వంటిదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించి మొత్తం 36 మండలాలను కరువు బారినుండి విముక్తి చేసే అవకాశం ఉంద న్నారు. అలాగే 16 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించవచ్చని తెలిపారు.
1996లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన గావించిన వెలిగొండ ప్రాజెక్ట్కు సంబంధించి గడిచిన 28 సంవత్సరాలలో 80% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇంకా కొన్ని కిలోమీటర్ల మేర 2వ టన్నెల్ పనులు, లైనింగ్వర్క్ టన్నెల్ నుండి రిజర్వాయర్లోకి నీరు వచ్చే కెనాల్ లైనింగ్ వర్క్ (5 కిలోమీటర్లు), ఇతరత్రా అసంపూర్తిగా ఉన్న కెనాల్ వర్క్స్ను పూర్తి చేయడానికి రూ.800 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి 11 గ్రామాలలో 7500 మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించిందని… వారికి పరిహారం నిమిత్తం ఇంజనీరింగ్ వర్గాల అంచనా మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.1000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని తెలిపారు. మొత్తంగా ప్రాజెక్టు పరిపూర్తికి మొత్తం రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వలో ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, నీరు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలుకోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. అంతేకాక గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయటం ద్వారా కృష్ణానది నుండి కృష్ణాడెల్టాకు రావలసిన 80 టీఎంసీల నికరజలాలను శ్రీశైలం రిజర్వాయర్లోనే నిల్వచేసి… వెనుకబడిన ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువచ్చేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా రామకృష్ణ కోరారు. ఈ అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలంగా స్పందించారు. రామకృష్ణ వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్.నారాయణ, జిల్లా నాయకులు ఆర్.వెంకట్రావ్, కె.వీరారెడ్డి ఉన్నారు.