హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల వ్యవ హారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని విష్ణు ప్యానల్ దుర్వినియోగం చేస్తోందంటూ ప్రకాశ్ రాజ్ మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు. ఆ వెంటనే తమకు ఈవీఎం ఎన్నికలపై నమ్మకం లేదని మంచు విష్ణు ప్రకటించారు. తనకు, తన ప్యానల్ సభ్యులకు ఈవీఎం ఎన్నికలపై నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని విష్ణు తెలిపారు. ఈ మేరకు ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణమోహన్ ప్రకటించారు. విష్ణు, ప్రకాశ్ రాజ్ చేసిన ప్రతిపాదనలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆయన కూడా బ్యాలెట్ విధానం వైపే మొగ్గు చూపినట్లు కృష్ణమోహన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓట్లు వేసే వారు ‘మా’కు లేఖ రాసి, ఫీజు కట్టాల్సి ఉంటుంది. అయితే విష్ణు ప్యానల్కు చెందిన ఓ వ్యక్తి కొంతమంది తరఫున ఈ ఫీజు చెల్లించినట్లు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.