Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెద్ద మనుషుల కొంచెపు బుద్ధులు

విశ్వ విద్యాలయాల వైస్‌ చాన్సలర్ల నియామకంలో గవర్నర్ల పాత్రకు అవకాశం లేకుండా చేసేందుకు కేరళలో వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం బిల్లులను ఆమోదించి గవర్నర్ల మీద వస్తున్న వివాదాలను ఓ మలుపు తిప్పింది. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ నడవడిక వామపక్ష ప్రభుత్వానికి ఆటంకం కలిగించే మేరకే పరిమితం కాలేదు. రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సుల మేరకే గవర్నర్ల అధికారాలు పరిమితమవు తాయన్న అంశాన్ని ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఏ మాత్రం పట్టించు కోలేదు. అడుగడుగునా ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. విశ్వవిద్యాలయాల రోజువారి కార్యనిర్వహణ బాధ్యతను వైస్‌ చాన్సలర్లు నిర్వహిస్తూ ఉంటే గవర్నర్లు చాన్సలర్లుగా ఉండడం కేవలం ఆనవాయితీ మాత్రమే కాదు. గవర్నర్లకు గౌరవస్థానం ఇవ్వడం కూడా. గౌరవస్థానం కల్పించడానికి మదహదాశయాలు, నియమ నిబంధనలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆస్థానంలో ఉన్నవారికి వాటిని పాటించే సంస్కారం కూడా ఉండాలి. కానీ మూడు, నాలుగు రాజకీయ పార్టీలు మారి చివరకు గవర్నర్‌ అయిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆ స్థానానికి ఉన్న గౌరవాన్ని పరిరక్షించకపోవడమే కాక తనకున్న స్థానాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంమీద కక్షగట్టినట్టు వ్యవహరించారు. ఈ ధోరణి మహారాష్ట్ర గవర్నర్‌ కోషియారీకి, తమిళనాడు గవర్నర్‌ రవికి కూడా ఉంది. రవి అయితే మాజీ పోలీసు అధికారి. కోషియారీ మొదటి నుంచి సంఫ్‌ు పరివార్‌ కుదురుతో సంబంధం ఉన్న వారే. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ లాంటి పార్టీలలోఉండి అనుభవించవలసిన పదవులు వగైరా అనుభవించి చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకుని గవర్నర్‌ అయిపోయిన ‘‘అనుభవజ్ఞుడు.’’ ఆయన వ్యవహార సరళిలో కనిపిస్తున్న అసంబద్ధత ఆయనకు రాజకీయ అనుభవం, విద్యాధిక్యత లేనందువల్ల కాదు. తనను ఆ స్థానంలో నియమించిన బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రుడిగా మెలగాలన్న ఆయన స్వామి భక్తే వివాదానికి మూలం. ఈ హడావుడిలోపడి రాజ్యాంగ బాధ్యతలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను గాలికి వదిలేశారు. తనకున్న పాండిత్యాన్ని తన కుతర్కాన్ని సమర్థించు కోవడానికే వినియోగిస్తున్నారు. కేరళలోని అబ్దుల్‌కలాం సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆ తీర్పు ఆసరాగా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మిగతా తొమ్మిది విశ్వ విద్యాలయాల వైస్‌చాన్సలర్లకు కూడా ఉద్వాసన పలకాలని భీష్మించుకునే దాకా వెళ్లింది. వైస్‌ చాన్సలర్ల నియామానికి నిర్దేశిత విధానంఉంది. ఓ ప్రత్యేక కమిటీ అర్హుల జాబితా తయారు చేస్తుంది. అందులోంచి రాష్ట్ర ప్రభుత్వం వైస్‌ చాన్సలర్లుగా ఎవరుండాలో జాబితా తయారుచేసి గవర్నరుకు నివేదిస్తే ఆయన ఆ సిఫార్సును అంగీకరించవలసి ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉంటే మరోసారి తమ నిర్ణయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పున:పరిశీలించవచ్చు లేదా మునుపటి సిఫార్సునే పునరుద్ఘాటించవచ్చు. అలాంటి స్థితిలో గవర్నరుకు ఉండే మార్గమల్లా ప్రభుత్వ సిఫార్సులను ఆమోదించడం మాత్రమే. కానీ వైస్‌చాన్సలర్ల నియామకంలో గవర్నరుకు ఉన్న అవకాశాన్ని, బాధ్యతను ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తెగలాగి తనకిలేని అధికారాన్ని చెలాయించి వైస్‌చాన్సలర్లను బర్తరఫ్‌ చేయడానికి వినియోగించు కోవాలనుకుంటున్నారు. వైస్‌చాన్సలర్లు అందరూ తక్షణం రాజీనామా చేయాలని నోటీసు ఇచ్చారు. కనీసం 24గంటల సమయం అయినా ఇవ్వలేదు. దీన్ని వైస్‌చాన్సలర్లు ఉన్నత న్యాయస్థానంలో సవాలుచేస్తే ఆ న్యాయస్థానం వైస్‌చాన్సలర్ల వాదన సక్రమమైందేనని తీర్పుచెప్పింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఆమోదించేపాటి లక్షణం కూడా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కు లేదు.
అసలు గవర్నర్ల వ్యవస్థ ఉండాలా లేదా అన్న విషయంపైనే రాజ్యాంగ నిర్ణాయక సభలో తీవ్రమైన చర్చ జరిగింది. చివరకు గవర్నర్ల వ్యవస్థ ఉండడం అవసరం అన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రాలలో భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవహార సరళి నిరంతరం వివాదాస్పదంగానే ఉంది. గవర్నర్ల వ్యవస్థ అవసరం అనుకున్నప్పుడు వారి నియామకంలో పాటించవలసిన నియమ నిబంధనలూ విస్తారంగానే చర్చకు వచ్చాయి. ఈ నియమ నిబంధనలను పాటించిన సందర్భాలకన్నా ఉల్లంఘించిన ఉదంతాలే ఎక్కువ. ఈ దుర్నీతి దేశమంతా కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యం ఉన్న రోజుల నుంచే కొనసాగుతోంది. గవర్నర్ల వ్యవస్థమీద లోతుగా అధ్యయనంచేసిన సర్కారియా కమిషన్‌ సిఫార్సులను, వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు తీర్పుల అంతస్సారాన్ని కేంద్రంలో అధికారంలోఉన్న పార్టీలు పట్టించుకున్న సందర్భాలూ అరుదే. రాజకీయాలకు అతీతమైన వారినే గవర్నర్లుగా నియమించాలన్న మౌలిక సూత్రాన్ని పాటించిన సందర్భాలున్నాయో లేవో తరచి చూడాలంటే విస్తారమైన పరిశోధనే అవసరం కావచ్చు.
రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడంకోసం గవర్నర్ల వ్యవస్థ అవసరం అనుకున్నారు. కానీ చివరకు ఈ మౌలిక అంశాన్ని పక్కనపెట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గవర్నర్లను తమ పరిచారికలుగా మార్చేశాయి. తమకు రాజకీయంగా ఉపకరించే రీతిలో గవర్నర్లు నడుచుకోవలసిన దుస్థితిని అనివార్యం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులనే గవర్నర్లుగా నియమించాలన్న సూత్రంలో గవర్నర్లు నిష్పక్షపాతంగా నడుచుకోవాలన్న మహదాశయం ఉంది. కానీ నియామకంలోనే కేంద్రప్రభుత్వ ప్రయోజనాలు అంతర్నిహితంగా ఉండడం బహిరంగ రహస్యమే. వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వంతో ఆరిఫ్‌ జగడం వైస్‌చాన్సలర్ల నియామకానికే పరిమితం కాలేదు. మంత్రుల విషయంలో కూడా ఆయన నియమ నిబంధనలకు, ఆనవాయితీలకు, రాజ్యాంగ నిర్దేశాలకు విపరీత వ్యాఖ్యానం చెప్పడం మొదలు పెట్టారు. మన రాజ్యాంగం మెజారిటీ ఉన్న పక్షం నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించాలని చెప్పదు.
మెజారిటీ నిరూపించుకోగలడన్న నమ్మకం గవర్నరుకు కుదిరితే ఆ వ్యక్తికి మంత్రివర్గం ఏర్పాటుచేసే అవకాశం గవర్నర్‌ ఇవ్వవచ్చు. మిగతా మంత్రులను ముఖ్యమంత్రి ఖరారు చేస్తారు. అందులో గవర్నరుకు ఏ ప్రమేయమూ ఉండదు. కానీ తన ‘‘విశ్వాసం’’ చూరగొనని మంత్రులు రాజీనామా చేయవల్సిందేనన్నంత దూరం ఆరిఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ ఈ ఉదంతాన్ని తెగ లాగుతున్నారు. రాజ్యాంగం ప్రకారం మన వ్యవస్థలన్నింటికీ విధి నిషేధాలున్నాయి. ఒక విభాగం దారితప్పకుండా మరో వ్యవస్థ నిఘావేసి ఉంచే నియమాలూ ఉన్నాయి. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఈ కీలక అంశాలను ఖాతరు చేయకుండా సకలాధికారాలు తనకే ఉన్నాయని అనుకుంటున్నారు. వివాదాస్పద గవర్నర్లు చివరకు ఆ వ్యవస్థమీదే వెగటుపుట్టించే పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి స్థితే గవర్నర్ల వ్యవస్థను రద్దుచేయాలన్న డిమాండ్లకు మరింత ఊతం ఇస్తుంది. పెద్ద మనుషుల కొంచెపు బుద్ధులు అసలు వ్యవస్థలనే విరూపం చేస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img