బొత్స వ్యాఖ్యలపై రామకృష్ణ ఆగ్రహం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమరావతి రైతులను రెచ్చగొట్టేలా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. అమరావతి రైతులు రోడ్డెక్కడానికి ప్రధానమైన కారణం సీఎం జగనేనని, మాట తప్పి మడమ తిప్పడం జగన్కు ఆనవాయితీగా మారిందని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. అమరావతి రాజధానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, అందుకే పదేపదే మూడు రాజధానుల ప్రస్తావన తెస్తోందని విమర్శించారు. హైకోర్టు అనుమతితో రైతులు చేపట్టిన అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రపై ‘మేం తలచుకుంటే పాదయాత్రను ఆపేస్తామంటూ’ సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ రెచ్చగొట్టే పద్ధతుల్లో వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానిం చారు. నిజంగా బొత్స సత్యనారాయణకు పాదయాత్రను ఆపే దమ్ముందా? అని ప్రశ్నించారు. గతంలోనూ అమరావతి ఉద్యమానికి పోటీగా వైసీపీ దీక్షలు పెట్టించిందని, కూలీలను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులిచ్చిందని గుర్తు చేశారు. వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారు కాదని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంటే ఓర్వలేక వైసీపీ మంత్రులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల పోలీసులను ప్రయోగించి పాదయాత్రను ఆపాలనే కుట్రలకు పాల్పడటాన్ని ఖండిరచారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుకు అప్పగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి గంగవరం పోర్టును అదానీ కంపెనీకి అప్పగించిందనీ, అదానీకి ఊడిగం చేస్తున్న ఈ పాలకులు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘విశాఖను ముంబైలా చేస్తామని’ చెబుతున్నారనిఎద్దేవా చేశారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన అమరావతిని నిర్వీర్యం చేసి, విశాఖను ముంబైలా చేస్తామని చెప్పడం ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్లు’గా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకుండా మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు జగన్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలపెట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాదయాత్ర సజావుగా సాగేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.