క్విట్ ఇండియా స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
మోదీ కార్మిక, రైతాంగ, కార్పొరేట్ విధానాలపై గళం విప్పాలి : ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు
కార్పొరేట్, మోదీ, అమిత్షా గుత్తాధిపత్యం : జల్లి విల్సన్
సవ్ అగ్రికల్చర్ నినాదంతో ఆందోళనలు : కేవీవీ ప్రసాద్
బీజేపీ విధానాలపై పోరుకు సమాయాత్తం కావాలి : పి.దుర్గాభవాని
కేంద్రంలోని బీజేపీ, నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ, కార్మిక, రైతాంగ వ్యతిరేక చర్యల్ని నిరసిస్తూ, క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 9న తలపెట్టిన సేవ్ ఇండియా పేరిట ఆందోళన కార్యక్రమాన్ని యావత్తు ప్రజానీకం జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో ఆదివారం ఏఐటీయూసీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఓబులేసు మాట్లాడుతూ దేశ వ్యాప్త పిలు పులో భాగంగా ఆగస్టు 9న మోదీ ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ, దేశంలోని రైతు, వ్యవసాయ, మహిళా, కార్మిక సంఘాలను, 450 స్వతంత్ర సంఘాలను కలుపుకుని 10 కేంద్ర కార్మిక సంఘాలు క్విట్ ఇండియా రోజు సేవ్ ఇండియా పేరిట రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిస్తు న్నట్లు తెలిపారు. మండల స్థాయి నుంచి దిల్లీలోని మోదీ పీఠం కదిలేలా గర్జించాలని పిలుపునిచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఉన్న ప్రజా ఆస్తులన్నీ తెగనమ్మి, ఆయనకు కావాల్సిన కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన 12 లక్షల ఎకరాల భూములను కాజేసి, వాటిని కార్పొరేట్కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఎల్ఐఎసీ, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ దిగ్గజ సంస్థల్ని సైతం నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా మోదీ, అమిత్షా పాలన కొనసాగుతోందన్నారు. దిల్లీలో ఆగస్టు 2,3 తేదీల్లో విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టబోయే ధర్నాలో రాష్ట్రంలోని వివిధ రంగాల నుంచి దాదాపు వెయ్యి మంది కార్మికులు తరలివెళ్లనున్నట్లు ఓబులేసు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జల్లి విల్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాల ప్రభావం గ్రామీణ కార్మికులపై తీవ్రంగా పడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్లు దుర్మార్గమైనవని విమర్శించారు. దాంతో గ్రామాల్లో ఉన్న రైతులు, రైతు కూలీలు, చేతివృత్తిదారుల జీవన విధానం, మనుగడకు ఆటంకం కలుగుతోందన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసి సాధించుకున్న, దేశంలోనే ఒక నైపుణ్యమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీపరం చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కనీసం ఉక్కు గనులను కేటాయించకుండా గత ప్రభుత్వాల నుంచి ప్రస్తుత మోదీ ప్రభుత్వం వరకూ నిర్లక్ష్యం చూపాయని విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో..ఆగస్టు 9న తలపెట్టబోయే నిరసనలకు వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ వినాశకర మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణల బిల్లు`2020 రద్దు చేయాలని డిమాండు చేశారు. రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే భవిష్యత్తులో వారికి ఉచిత విద్యుత్కు ఎగనామం పెట్టడమేనని పేర్కొన్నారు. సహకార రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి పెట్టుకోవాలని కుట్ర పన్నుతోందన్నారు. మోదీ ప్రభుత్వ రైతాంగ విధానాల్ని ఎండగడుతూ ఈనెల 22 నుంచి ఆగస్టు 9వరకు పార్లమెంట్ వద్ద కిసాన్ సన్సద్ (రైతు పార్లమెంట్)ను కొనసాగిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని మాట్లాడుతూ ఆగస్టు 9న సేవ్ ఇండియా నినాదంతో చేపట్టబోయే ఆందోళనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా, దేశాన్ని రక్షించేందుకు ప్రజా సంఘాలు పెద్దఎత్తున సమాయాత్తం కావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి టి.తాతయ్య పాల్గొన్నారు.