. ఆంధ్రా, ఎస్వీయూలో భారీగా ఖాళీలు
. 188 మంది పదవీ విరమణ
. భర్తీలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం
. న్యాయ చిక్కులతో సాగదీత
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులు భర్తీకాకపోవడంతో విద్యావ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయాలు ఫలితాలు సాధించడంలో, పరిశోధనలో వెనక పడుతున్నాయి. విద్యాబోధన, ఉన్నత ప్రమాణాలు దూరమవుతున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్) ర్యాంకింగ్లో మన విశ్వవిద్యాలయాలకు చోటు కనిపించడం లేదు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) 43వ ర్యాంక్కు దిగజారడం బాధాకరం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏయూ 14వ ర్యాంకులో ఉండగా, తాజాగా అది ఘోరంగా పతనమైంది. మిగిలిన విశ్వవిద్యాలయాల పరిస్థితి అంతకంటే దారుణం. ప్రభుత్వ లోగుట్టును ఎన్ఐఆర్ఎఫ్ బట్టబయలు చేసింది. సుదీర్ఘకాలం నుంచి ఆచార్యుల పోస్టులు భర్తీ కాకపోవడం, విశ్వవిద్యాలయాల బలోపేతంపై ప్రభుత్వం వివక్ష చూపడమే దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆచార్య అనే పదం వినిపించడం కష్టమనే భావించాలి. దీనిపై ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు తగ్గడం, ఆచార్య పోస్టులు భర్తీ చేయకుండానే పటిష్టమైన విద్యావ్యస్థను, ఫలితాలు సాధిస్తున్నామని ఏపీ ఈఏపీసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం విచారకరం. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎస్వీయూ పరిధిలో మూడేళ్ల క్రితం 188 మంది ఆచార్యులు పదవీ విరమణ చేశారు. ఆయా ఖాళీల భర్తీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆచార్యులు లేకుండానే విద్యాబోధన కొనసాగుతోంది. 2018లో ఆచార్యుల నియామకం కోసం అప్పటి ప్రభుత్వం హడావిడిగా ప్రకటన జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ న్యాయస్థానాల్లో 70 కేసులు నమోదయ్యాయి. న్యాయపరమైన చిక్కుల కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఆచార్యుల పోస్టులు భర్తీ అయ్యేంత వరకు తాను విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కాబోనని సీఎం జగన్ గట్టిగా ఆదేశించినట్లు ఉన్నత విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. న్యాయపరమైన కారణాలతో నిలిచిన ఆచార్య పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుందో… తమకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయోననే ఆందోనలో అభ్యర్థులు ఉన్నారు. ఆచార్యుల పోస్టుల భర్తీ కాకుంటే విశ్వవిద్యాలయాల పురోగతి ప్రశ్నార్థకంగా మారుతుంది.
వర్సిటీల ఉనికి ప్రశ్నార్థకం
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి ఒకప్పుడు విద్యార్థులు పోటీ పడేవారు. ప్రవేశ పరీక్షలు రాసి తమకు నచ్చిన కోర్సులు అభ్యసించేవారు. కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడంతో అవి నిరాదరణకు గురవుతున్నాయి. ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల రాకతో ప్రభుత్వ వర్సిటీలు మరింతగా ఉనికి కోల్పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు సక్రమంగా రాకపోవడంతో విశ్వవిద్యాలయాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. విశ్వవిద్యాలయాల వీసీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వైసీపీ సానుభూతిపరులకు పెద్దఎత్తున పదవులు కట్టబెట్టడం వల్ల అవి మరింత గాడి తప్పుతున్నాయని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఆంధ్రా నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు జగన్ ప్రభుత్వం నియమించిన వీసీల నిర్వహణ తీరు తీవ్ర విమర్శలకు గురైంది. విశ్వవిద్యాలయాల కార్యకలాపాల్లో వీసీల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వీసీలు అధికారి పార్టీకి కొమ్ము కాస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై చాలాసార్లు గవర్నరుకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి విశ్వవిద్యాలయాలకు వచ్చే నిధులు తగ్గిపోతున్నాయి. ఈ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. వివిధ సంస్థల నుంచి రూ.27 కోట్ల నిధులు వచ్చినప్పటికీ విశ్వవిద్యాలయాల అభివృద్ధి ముందుకెళ్లడం లేదు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని న్యాయపరమైన సమస్యల్ని అధిగమించి విశ్వవిద్యాలయాల బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కోర్టు కేసులతో నిలిచిపోయిన ఆచార్య పోస్టుల భర్తీపైనా దృష్టి సారించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
కోర్టు కేసులతోనే జాప్యం
కోర్టు కేసులతోనే ఆచార్యుల పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం కొంతకాలం నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు దరఖాస్తు చేయడంతోనే క్రమేపీ రాష్ట్రాల విశ్వవిద్యాల యాలకు ర్యాంకులు తగ్గుతున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2016లో ప్రారంభమైందని, అప్పట్లో పెద్దగా ఐఐటీ, ఎన్ఐటీ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ర్యాంకింగ్లో భాగస్వామ్యమయ్యేవి కావని గుర్తుచేశారు. ఆ సమయంలో రాష్ట్రంలోని ఆంధ్రా, ఎస్వీయూ తదితర విశ్వవిద్యాలయాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ముందున్నాయని వివరించారు. ఐఐటీ, ఎన్ఐటీలు సైతం ఈ ర్యాంకింగ్ కోసం దరఖాస్తు చేయడం, భాగస్వామ్యం కావడంతో మన విశ్వవిద్యాలయాలు కొద్దిగా వెనుకబాటుకు గురవుతున్నాయని తెలిపారు. ఆంధ్రా, ఎస్వీయూలో మూడేళ్ల క్రింత 188 మంది ఆచార్యులు పదవీ విరమణ చేశారన్నారు. న్యాయ చిక్కుల కారణంగా ఆయా పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని, వాటిని త్వరలో అధిగమిస్తామని చెప్పారు.
హేమచంద్రారెడ్డి,
చైర్మన్ ,ఉన్నత విద్యామండలి