ట్రెబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం
ట్రైబ్యునళ్లలో నియామకాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మండిపడిరది. ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం..సభ్యుల ఎంపిక విధానాన్పి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తప్పుపట్టింది. ఖాళీల భర్తీ విషయంలో కోర్టు ఇప్పటికే చాలా సహనం పాటించిందని, రెండు వారాల్లో ట్రిబ్యునల్ నియామకాలు మొత్తం పూర్తవ్వాలని, ఎవరినైనా నియమించకపోతే కారణం చెప్పాలని ఆదేశించింది. ‘ట్రైబ్యునళ్లలో భర్తీల ఇంటర్వ్యూలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. అందుకే మేము కొవిడ్ పరిస్థితుల్లోనూ దేశమంతా తిరిగి 544 మందిని ఇంటర్వ్యూ చేశాం. అందులో నుంచి 11 మంది జ్యూడీషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యుల పేర్లు ఇచ్చాం. ఇంతమందిలో కొందరినే నియమించారు. మిగతా వాళ్ల పేర్లను వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియామకాలు చూశాను. మేము ఎక్కువ సిఫార్సులు చేశాం. కానీ అందులో నుంచి కొందరినే నియమించారు. ఇదేం ఎంపిక? ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లోనూ అలాగే చేశారు. మీ నిర్ణయాలు చాలా అసంతృప్తి కలిగించాయి. మా సమయాన్ని వృథా చేసుకున్నాం..అని రమణ అసహనం వ్యక్తంచేశారు. దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నియామకాలు చేపట్టామని తెలిపారు. కొన్ని సిఫార్సులను వదిలేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ తెలిపారు. అయితే కోర్టు ఇందుకు తిరస్కరించింది. ఈ సమస్యకు కౌంటర్ దాఖలు చేయడం పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. కేంద్రానికి రెండు వారాలు గడువు కల్పిస్తున్నామని, ఆలోగా సరైన సభ్యులతో నియామకాలు చేపట్టి, అపాయింట్మెంట్ లెటర్లతో తమ వద్దకు రావాలని ఆదేశించింది.