. ఇంజినీరింగ్ సీట్ల గందరగోళం
. మళ్లీ ఏపీ వెనుకంజ
. తెలంగాణలో కౌన్సెలింగ్కు షెడ్యూలు
. కొరవడిన ప్రామాణిక విద్య
. అరకొర ప్లేస్మెంట్లు
. విద్యార్థులకు తీవ్ర నష్టం
విశాలాంధ్రబ్యూరో-అమరావతి: ఏటా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో తెలంగాణ రాష్ట్రం ముందుంటోంది. ఈ విషయంలో ఈ ఏడాదీ ఏపీ వెనుకబాటుకు గురవుతోంది. ఈ విద్యా సంవత్సరానికిగాను టీఎస్ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఈ నెల 26 నుంచి జులై 5 వరకు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు గడువు విధించింది. తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈనెల 28 నుంచి ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలిస్తారు. ఏపీలో మాత్రం ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియపై స్పష్టత లేదు. ఏపీ ఈఏపీ సెట్ 2023లో 1,71,514 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాల సమయంలో జులై15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచినా, ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. ప్రతి సంవత్సరం ఏపీ కంటే తెలంగాణలోనే ముందస్తుగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించడంతో, ఇక్కడి విద్యార్థులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా కౌన్సెలింగ్ మొదటి విడత పూర్తయ్యాకనే, ఏపీ ఈఏపీసెట్కు షెడ్యూలు జారీజేస్తున్నారు. ఏటా ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుండటంతో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో నష్టపోతున్నారు.
పక్క రాష్ట్రాలకు ఏపీ విద్యార్థులు
ఈ పరిస్థితుల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రాని వారంతా పక్క రాష్ట్రాల్లోని డీమ్డ్/ప్రైవేట్ యూనివర్సిటీలకు తరలిపోతున్నారు. మరికొందరు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ కౌన్సిలింగ్ కు హాజరై సీట్లు పొందుతున్నారు. ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభించడంతోనే ఈ దుస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏపీ ఇంజనీరింగ్ కళాశాలల్లో చాలావరకు ప్రామాణిక విద్య, మౌలిక సౌకర్యాలు లేనందున విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తంగా లక్షా 43వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మూడు దశల కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నానా పాట్లు పడిరది. గతేడాది కౌన్సెలింగ్లో అభ్యర్థుల నుంచి స్పందన నామాత్రంగానే ఉంది. ఈ ఏడాది కౌన్సెలింగ్కు ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లు పొందలేని వారంతా, తొలుత తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రవేశాలపై ఆసక్తి చూపుతున్నారు. చివరకు ఎక్కడా సీటు రానివారంతా ఏపీలో చేరుతున్నారు. ఆంధ్రాలో మొక్కుబడిగా కొన్ని ఇంజినీరింగ్ కళాశాల్లోనే ప్రామాణిక విద్య, మౌలిక సౌకర్యాలు, ప్లేస్మెంట్ల సౌకర్యముంది. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్లేస్మెంట్లపైనే విద్యార్థుల దృష్టి
ఇంజినీరింగ్ లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులంతా ముందస్తుగా ప్లేస్మెంట్ల పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీంతో మొదటగా ఐఐటీ, ఎన్ఐటీ సీట్లు రానివారంతా ప్రైవేట్ / డీమ్డ్ యూనివర్సిటీలలో సీట్ల కోసం తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణలోని డీమ్డ్/ ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ విద్య పూర్తవగానే ప్లేస్మెంట్లు లభిస్తుండగా, ఆంధ్రాలోని ఎక్కువ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో అలాంటి పరిస్థితుల్లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్లేస్మెంట్లు వస్తాయనే ఆశతో అభ్యర్థులు ఇంజనీరింగ్ సీట్ల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడంతో పేద, మధ్యతరగతి వారే ఇక్కడ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తయ్యాక పూర్తిస్థాయి నైపుణ్యత లేనందున ఉపాధికి, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. కనీసం ప్రైవేటు ఉద్యోగాలు సైతం దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రమాణిక విద్య, ప్లేస్మెంట్ల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం వల్లే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. సీఎం జగన్ ఇప్పటికైనా వాటిపై దృష్టి పెట్టి, ఇంజినీరింగ్ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.