. సర్పంచ్ల ‘చలో తాడేపల్లి’ ఉద్యమానికి సీపీఐ మద్దతు
. స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ : కేంద్రం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తీసుకురానున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మధ్య విభజన తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం నడుం బిగించిందని విమర్శించారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు దిల్లీలో జరగనున్నాయని తెలిపారు. ఆ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చించి దేశంలోని ఇతర వామపక్ష, లౌకిక పార్టీలను కలుపుకుని ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి కార్యాచరణ రూపొందించటం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో మైనార్టీల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. అట్టడుగు వర్గాలకు కూడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రపంచం ముందుకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తోందని, ఇటీవల కర్నాటక ఎన్నికల్లో చాలా స్పష్టంగా మత అజెండాను తీసుకువచ్చారని విమర్శించారు. అప్పటివరకు అక్కడ ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి గురించి చెప్పుకోవటానికి ఏమీలేక మతాన్ని ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. తిరిగి కర్నాటకలో అధికారంలోకి వస్తే 4 శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని 2 శాతం లింగాయత్లకు, మరో 2 శాతం ఇతర అగ్రవర్ణాలకు ఇస్తామని ప్రకటించి మెజార్టీ ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నించిందన్నారు. ది కేరళ స్టోరి సినిమా చూసి ఓటు వేయమని, పోలింగ్ బూత్లో జై భజరంగ్ భళీ అంటూ ఓటు వేయాలని మోదీ చెప్పారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత నిర్లజ్జగా, బహిరంగంగా మతాన్ని రెచ్చగొడుతూ ఎన్నికలు జరగలేదన్నారు. ప్రధాన మంత్రి ఇంత దిగజారుడు విధానానికి పూనుకున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 11 నిత్యావసర వస్తువుల్లో ఒక్క ఉప్పు తప్ప అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు. నిరుద్యోగ సమస్యను 40 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లారని మండిపడ్డారు. రైతులకు లక్షల కోట్లు ఖర్చు చేశామని, రైతులు సంతోషంగా ఉన్నారని కేంద్రం అబద్ధాలు చెబుతోందన్నారు. దేశంలో రైతులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని దద్దమ్మ ప్రధానిగా ఉండటం మన దౌర్భాగ్యం అన్నారు.
సర్పంచ్ల ‘చలో తాడేపల్లి’కి సీపీఐ మద్దతు
సోమవారం ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్వర్యంలో చేపట్టిన ‘చలో తాడేపల్లి’ పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను గృహనిర్బంధం చేయటాన్ని తీవ్రంగా ఖండిరచారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవటం దుర్మార్గం అన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,245 కోట్లను విద్యుత్ బకాయిల కింద సర్దుబాటు చేస్తున్నామని లాగేసుకుందన్నారు. 15వ ఆర్థిక సంఘం మొదటి విడతగా మే నెలలో విడుదల చేసిన నిధులు రూ.988 కోట్లు ఇంకా పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో వేయలేదన్నారు. వైసీపీకి చెందిన ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం నాయకుడు పాపారావును బెదిరిస్తున్నారని, సర్పంచ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యాంగపరంగా 73, 74 సవరణల ద్వారా పంచాయతీలకు ఉన్న అధికారాలను సీఎం జగన్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు లాగేసుకుంటే కిందస్థాయిలో సర్పంచ్లు అభివృద్ధి పనులు ఎలా చేసుకుంటారని నిలదీశారు. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో వేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
‘అమ్మఒడి’లో మోసం
అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు బటన్ నొక్కినా ఇంత వరకు చాలా మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. అమ్మఒడి కింద రూ.6,400 కోట్లు విడుదల చేయాల్సి ఉంటే కేవలం రూ.2,300 కోట్లు మాత్రమే జమ చేశారని తెలిపారు. సీఎం జగన్ మోసం చేయటంతో పేదలు ప్రతి రోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం ఆలస్యమైనా పర్వాలేదని డబ్బులు వేసినట్లు చెప్పి బటన్ నొక్కి ప్రజలను మోసం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ముందు చదువుకునే పిల్లలందరికీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబానికి ఒక్కరికే అని మోసం చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు క్లీనింగ్ చార్జీల కింద రూ.2 వేలు తగ్గించి 13 వేల రూపాయలు జమ చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలలో ఉండే పారిశుద్ధ్య సిబ్బందికి ఆ డబ్బులు ఇవ్వటం లేదన్నారు. ఐదారు నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం
రాష్ట్రం ప్రభుత్వం అమలు చేయనున్న స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా జూన్ 30న పది వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపినా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు లేదన్నారు. రాష్ట్ర స్థాయిలో స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో దోపిడీ జరుగుతుందని విమర్శించారు. తాము అనేక సార్లు ఆరోపణలు చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదన్నారు. స్మార్ట్ మీటర్ల ధర చత్తీస్గఢ్లో రూ.7,100, రాజస్థాన్లో రూ.7,900 అయితే ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం రూ.36,700 ఉందన్నారు. ఈ దోపిడీపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ ఇచ్చే కమీషన్కు కక్కుర్తి పడి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయటానికి పూనుకున్నారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు అడిగారని స్మార్ట్మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు.
విద్యుత్ చార్జీలు పెంచకుండా తెలంగాణలో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఏపీలో ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారని తెలిపారు. ఈ నెల 4న వామపక్ష పార్టీల నాయకులు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు రామకృష్ణ వివరించారు. స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు.