అజిత్`శరద్ వర్గాల వాదన: ఈసీ వద్దకు పంచాయితీ
అధ్యక్షుడిగా పవార్ను తొలగించాం: రెబల్ వర్గం
న్యూదిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో వర్గపోరు ముదిరింది. ఈ పార్టీ మాది… కాదు మాది అంటూ అధ్యక్షుడు శరద్ పవార్, తిరుగుబాటు నేత అజిత్ పవార్ వాదించుకుంటున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడి స్థానం నుంచి శరద్ పవార్ను తొలగించినట్లు అజిత్ వర్గం ప్రకటించింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ)కి వెల్లడిరచినట్లు తెలిపింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని కోరింది. తమకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల 40 అఫిడవిట్లను అజిత్ పవార్ వర్గం తాజాగా ఈసీకి సమర్పించింది. వర్గపోరుపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు తమ పక్షం వాదన వినాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తూ కేవియట్ను శరద్పవార్ వర్గం దాఖలు చేసినట్లు ఈసీ వర్గాలు వెల్లడిరచాయి. రాబోయే రోజుల్లో దరఖాస్తులను కమిషన్ పరిశీలించి తమకిచ్చిన పత్రాలను ఇచ్చిపుచ్చుకోవాలని కూడా రెండు వర్గాలకు ఈసీ సూచించనుంది. 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నదంటూ అజిత్ పవార్ శివసేన`బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. ఉపముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తమదే నిజమైన ఎన్సీపీ అని ఇటు శరద్ పవార్, అటు అజిత్ పవార్ మధ్య వివాదం సాగుతోంది. ఇదే క్రమంలో ప్రఫుల్ పటేల్, సునీశ్ తక్కారేను తమ పార్టీ నుంచి శరద్ పవార్ బహిష్కరించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు తొమ్మిది మందిపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ను కోరారు. ఎన్సీపీని రెండు దశాబ్దాల కిందట శరద్ పవార్ ఏర్పాటు చేసిన విషయం విదితమే.