. తెలంగాణ సహా మరో ఐదు హైకోర్టులకు కూడా
. సుప్రీం జడ్జీలుగా తెలంగాణ, కేరళ ప్రధాన న్యాయమూర్తులు
. కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సులు
న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను నియమించాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధే (కర్నాటక హైకోర్టు జడ్జి) పేరును ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తెలంగాణ, కేరళ హైకోర్టుల సీజేలు జస్టిస్ ఉజ్జల్ భుయన్, జస్టిస్ ఎస్ వెంకనారాయణ భట్టిని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, మణిపూర్, బాంబే గుజరాత్ ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వ కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు పదోన్నతి లభించడంతో మే 19న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం ఖాళీ అయింది. ఈ స్థానంలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను నియమించాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన జమ్ముకశ్మీర్ హైకోర్టు జడ్జిగా 2013, మార్చి 8న నియమితులు కాగా 2022 జూన్లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడే విధుల్లో ఉన్నారు. 2023, ఫిబ్రవరి 9న జస్టిస్ ఠాకూర్కు మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని కొలీజియం చేసిన సిఫార్సు కేంద్రప్రభుత్వం వద్ద పెండిరగ్లో ఉంది. జస్టిస్ ఠాకూర్ నియామకంతో జమ్ముకశ్మీర్, లఢక్ హైకోర్టుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల మధ్య ప్రాతినిధ్యం లభిస్తుందనే ఉద్దేశంతో ఆయనను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం తాజాగా సిఫార్సు చేసింది. మరోవైపు జస్టిస్ ఉజ్జల్ భుయన్కు సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే ప్రతిపాదన చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం ఖాళీ అవుతుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం కర్నాటక హైకోర్టు జడ్జి అలోక్ అరాధెను నియమించాలని సూచించింది. అదే విధంగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు జడ్జి దేంద్ర కుమార్ ఉపాధ్యాయ, గుజరాత్ హైకోర్టు సీజేగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సునితా అగర్వాల్, కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆశీష్ జె.దేశాయ్ (గుజరాత్ హైకోర్టు సీజే), మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ మృదుల్, ఒడిశా హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాసిస్ తాళపత్ర పేర్లను సిఫార్సు చేసింది.