. దిగిరాని కూరగాయల ధరలు
. సామాన్యుడికి అందని నిత్యావసరాలు
. పేదోడి నరకయాతన బ పట్టించుకోని అధికారులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: కూరగాయలు కొనలేం…తినలేం…అనే రీతిలో ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలూ పోటీ పడుతున్నాయి. పేదోడికి పట్టెడన్నం తినే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు రెట్టింపు పెరిగిపోవడంతో సామాన్యుడు ఆర్థికంగా చితికిపోతున్నాడు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు, గుంటూరు నుంచి అనంతపురం వరకు ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తింది. మార్కెట్లో పది రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ…ధరల నియంత్రణలో నూతన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదు. మార్కెట్లో ఉన్న కూరగాయల ధరలతోపాటు రైతు బజార్లోనూ రెట్టింపుకావడంతో…సామాన్యుడి సంచి అడుగుకూ కూరగాయలు రావడంలేదు. గతం కంటే రెండు, మూడు వందల రూపాయలు జేబులో వేసుకుని రైతు బజారుకు వెళ్లినా, అధిక ధరలతో కిలోకు బదులు, పావు, అర కిలోతోనే కూరగాయలు కొనుగోలు చేసి సరిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రధానంగా పది రోజుల నుంచి టమాటా ధరలు దిగిరావడం లేదు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే టమాటా ధర పెరిగిందని ప్రభుత్వ అధికారులు వివరణతోనే సరిపెట్టుకుంటున్నారేగానీ, ధరల నియంత్రణకు తగిన కార్యాచరణ చేపట్టలేదు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ కూరగాయల ధరల తగ్గింపు పెద్ద సవాల్గా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు, తిరుపతి, అనంతపురం ఇలా…ఏ నగరం చూసినా, పల్లె చూసినా కూరగాయలను ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక గత్యంతరం లేక ఉద్యోగస్తుల నుంచి పేద, మధ్య తరగతి వర్గాలు సైతం కూరగాయల బడ్జెట్ తగ్గించుకుంటున్నారు. గతంలో వారానికి రెండు, మూడు కిలోల చొప్పున టమాటాను కొనుగోలు చేసే వినియోగదారుడు ఇప్పుడు ఏకంగా పావు, అర కిలోతోనే సరిపెడుతున్నాడు. దీంతో కొనుగోలు శక్తి కూడా పడిపోయింది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా దాదాపు రూ.100, వంకాయ రూ.80, బంగాళాదుంప రూ.100 చొప్పున పలుకుతున్నాయి. ఇదే రీతిలో రైతు బజార్లలోను ధరలు పెరిగిపోయాయి. వంకాయ రైతు బజారులో రూ.40, బంగాళాదుంప రూ.36, బెండ 35, పచ్చిమిర్చి రూ.56, ఉల్లిపాయ రూ.36కు కొంచెం అటూ…ఇటుగా ఉన్నాయి. గతంలో ఆకుకూరలు పది రూపాయలకు నాలుగు కట్టలు ఇస్తే… ఇప్పుడు రెండు కట్టలనే కుదించి విక్రయిస్తున్నారు. క్యాబేజీ, క్యారెట్, సొర, బీర, పొట్లకాయ తదితర కూరగాయల ధరలు సామాన్యుడికి అందడం లేదు. దీంతో మార్కెట్టుకు గానీ లేదా రైతు బజారుకుగానీ వెళ్లామా? వచ్చామా? అనే రీతిలో వినియోగదారుడు ఉన్నారు. కేవలం మొక్కుబడిగానే కొనుగోలు చేస్తున్నాడు. గతంలో రూ.200 నుంచి రూ.300 తీసుకుని రైతు బజారుకు వెళ్తే…సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సంచిలో కనిపించడం లేదు. దీంతో తెచ్చిన కూరగాయలు రెండు, మూడు రోజులకే అయిపోతున్నాయి.
పప్పు ధరల మోత
కూరగాయలతోపాటు పప్పుల ధరలూ మోత మోగుతున్నాయి. కందిపప్పు, మినప, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు ఏది చూసినా ధరలు పెరిగిపోయాయి. కిలో పెసరపప్పు రూ.130, మినపగుళ్లు రూ.140, పంచదార రూ.45కు చేరువైంది. చింతపండు, ఇడ్లీ రవ్వ, మైదా…ఇలా అనేక నిత్యావసర వస్తువుల్లోను పెరుగుదల కన్పిస్తోంది. అల్లం, వెల్లుల్లి కిలో రూ.200 దాటేసింది. నిత్యం వంటింట్లో ఉండాల్సిన ఈ నిత్యావసరాలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఎడాపెడా ధరలు పెరగడంతోనే సామాన్యుడు పొదుపుగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పది రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో తాము ఆర్థికంగా చితికిపోతున్నామని వాపోతున్నారు. సబ్బులు, పేస్టులు…ఇలా సర్వం పెరగడంతో మహిళల వంటింటి పొదుపు బడ్జెట్ కుదించుకుపోతున్నది. ఇవి అందుబాటు ధరలో లేకపోవడంతో సామాన్యుడు వాటిని అరకొరగానే కొనుగోలు చేస్తున్నాడు. ప్రతి వస్తువుకూ సామాన్యుడు జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ…ఈ తరహాలో ధరలు పెరగడంతో పేదవాడు చితికిపోతున్నాడు. ప్రతినెలా కూరగాయలు, నిత్యావసరాల కోసం వినియోగదారుడు కొంత బడ్జెట్ కేటాయించడం ఆనవాయితీగా ఉండేది. ఈ నెలలో అది కేవలం పది రోజులకే అయిపోయింది. నెల మధ్యలో డబ్బులు లేక… బయట కూరగాయలు కొనుగోలు చేయలేక…ఉన్నవాటితోనే సర్దుకుపోయే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.