. దిల్లీ కేంద్రంగా కీలక సమావేశం
. పూర్వ వైభవం కోసం ఆధిష్ఠానం కసరత్తు
. చేరికలపై దృష్టి…షర్మిల ఎంట్రీపై పుకార్లు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. మరో నాలుగు నెలల్లో లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్కు గెలుపులేదు. ఒక్కరు కూడా చట్టసభలకు ఎన్నికవలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్కు కేవలం నాయకత్వ కమిటీలు మాత్రమే ఉన్నాయని, ఓటర్లు లేరని తేలిపోయింది. అయితే కర్నాటక, తెలంగాణలో గెలుపొంది… అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో కొంత జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తమ సత్తా చాటాలనే దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీంతో దిల్లీ కేంద్రంగా ఏఐసీసీ కార్యాలయంలో ఏపీ నేతలతో కలిసి ఆధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఖడ్గే తదితర నేతల సమక్షంలో జరిగిన సమావేశానికి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, పల్లంరాజు, ముఖ్య నేతలు హాజరయ్యారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతతో పాటు కొత్తగా ఆపార్టీలోకి వచ్చే వారిపైనా చర్చించారు. కాంగ్రెస్కు ఎలాగైనా ఏపీలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు కావాల్సిన అనుకూల రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇప్ప టికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలో వివిధ పార్టీలు కలిపి ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయి. ఈ కూటమి ఏర్పాటు తర్వాత జరిగిన రాష్ట్రాల అసెం బ్లీ ఎన్నికల్లో, కూటమి భాగస్వామ్య పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు, కలిసి పోటీ చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది.
పర్యవసానంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. భవిష్యత్లో జరిగే ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు కొనసాగకుండా, ఐక్యంగా ముందుకు పోవాలని విపక్షాలు సూచిస్తు న్నాయి. ఏపీలో జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుందా? లేదా? అనేదీ తేలాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్కు 1.17 ఓటింగ్ శాతం మాత్రమే ఉంది. ఇంత తక్కువగా ఉన్న ఓటింగ్ శాతంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా తన సత్తా చాటుతుందనేదీ ఆ పార్టీ ఆధిష్ఠానానికి అంతుచిక్కడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మూడు నెలల్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. 175 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించేందుకు సమాయాత్తమైంది.
సంస్థాగతంగా వెనుకబాటు
ఏపీలో కాంగ్రెస్ సంస్థాగతంగా పూర్తిగా వెనుకబాటుకు గురైంది.. దాదాపు పదేళ్ల నుంచి కాంగ్రెస్ బలోపే తంపై పార్టీ నేతలు కృషి చేసినప్పటికీ ఫలించలేదు. ఇటీవల కాలంలో పార్టీలోకి ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం చేరడం ఆ పార్టీ నేతల్లో కొంత సంతో షం నెలకొంది. అయితే కొత్తగా వచ్చిన వారిలో ఎమ్మెల్యే, లేదా ఎంపీ స్థాయి పోటీ చేసే నేతలు లేరు. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు బలమైనవి ఉన్నా యని చెప్పుకునే పరిస్థితి లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంక్ అంతా వైసీపీ చేతిలోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ తన సాంప్రదాయ ఓట్ బ్యాంక్ను తిరిగి రప్పించుకోలేకపోయింది. వాటిని దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం సన్నద్ధత సమావేశాలను ప్రారంభించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు ఏపీలోని ప్రధాన సమస్యలపై మూడు ప్రాంతాల్లో బహిరంగ సభల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. వాట ికి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కార్యాచ రణ రూపొందిస్తోంది. మరోవైపు పార్టీలోకి కొత్తవారిని ఆహ్వానించే దిశగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది.
షర్మిల ఎంట్రీ? :
ఏపీ కాంగ్రెస్లోకి తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రవేశిస్తున్నారన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణులకు కాస్త ఊరటనిస్తుండగా… వైసీపీలో మాత్రం ఆందోళన నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్లో కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఆమెను అడ్డుకోవడంతోనే షర్మిల చేరిక నిలిచిపోయిందన్న ప్రచారం ఉంది. ఆమె పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయకపోయినప్పటికీ, కాంగ్రెస్కే మద్దతును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆమె రాజకీయ కార్యకలాపాలు విఫలమవ్వడంతో… ఇప్పుడు ఆమె దృష్టి ఏపీపై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్లోకి తన పార్టీని విలీనం చేసి, దాని ద్వారా ఏపీలోకి ప్రవేశించేందుకు షర్మిలతో కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో టికెట్లు రావని తెలిసి, అసంతృప్తిగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీవీ రామచంద్రరావు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. షర్మిల భర్త అనిల్కుమార్ సైతం ఏపీలోని ఆయన మత వర్గానికి చెందిన వారితో ఫోన్లలో సంప్రదింపులు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారముంది. కాగా కాంగ్రెస్లో షర్మిల చేరికను ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆమె తనయుడైన, ప్రస్తుత సీఎం జగన్ను కాంగ్రెస్ ఆధిష్ఠానం అనేక ఇబ్బందులకు గురిచేసి, జైలుకు పంపిందని… వాటన్నింటినీ మరచి కాంగ్రెస్లోకి వెళ్లడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంతో విజయమ్మ కూడా ఏపీలోని వైసీపీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకుని ఆమెతో వెళ్లిపోయారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే, విజయమ్మ మళ్లీ ఏపీలోని వైసీపీలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. అయితే కాంగ్రెస్లో చేరికపై ఇంతవరకు షర్మిల అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.