దొడ్డిదారిన అధికారంలోకి రావడమే లక్ష్యం
రెండేళ్లలో రెండు పెద్ద పార్టీలను చీల్చిన బీజేపీ
ముంబై : కేంద్రంలో అధికార బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారం చెలాయించాలన్న కుట్రలను కొనసాగిస్తోంది. మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు రెండేళ్లలో ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేనను, తాజాగా ఎన్సీపీని బీజేపీ చీల్చింది. 2022లో తొలుత శివసేన విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నింది. దీంతో శివసేన నేత ఏక్నాథ్ షిండే ఆ పార్టీలో తిరుగుబాటు చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఉద్ధవ్ థాకరేకు ఆయన ఎదురుతిరిగారు. ఈ పరిణామాల వల్ల గత ఏడాది జూన్లో సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేయడంతో శివసేన, ఎన్సీపీతో కాంగ్రెస్తో కూడిన మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం 2022 జూన్ 30న ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాల వల్ల ఆ రాష్ట్రంలో అత్యంత బలమైన శివసేన పార్టీ రెండుగా చీలింది. కాగా, సరిగ్గా ఏడాది తర్వాత మహారాష్ట్రలో రెండో అతి పెద్ద విపక్ష పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ని కూడా బీజేపీ విచ్ఛిన్నం చేసింది. రాజకీయ కురువృద్ధుడైన శరద్ పవార్ నేతృత్వంలోని ఆ పార్టీని చీల్చింది. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్తో తిరుగుబాటు చేయించింది. దీంతో ఆదివారం తన వర్గానికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆయన చేరారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, ఆయన వర్గానికి చెందిన చగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటుతో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వర్గంలో కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉండనున్నారు. మహారాష్ట్రలో బీజేపీ రెండు కుట్రల వల్ల ఉద్ధవ్ థాకరే మాదిరి రాజకీయ పరిస్థితిని శరద్ పవార్ ఎదుర్కోనున్నారు.