135 సీట్లతో టీడీపీ విజయభేరి
. 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ
. 21 స్థానాల్లో జనసేనఎనిమిదింట బీజేపీ విజయం
. ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరం
. టీడీపీ కూటమికి 21 ఎంపీ సీట్లు
వైసీపీకి 4
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలకు జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎనిమిది జిల్లాల్లో వైసీపీ కనీసం బోణీ కొట్టలేదు. జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ… తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి ప్రజలు ఘన విజయం అందించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. ‘వార్ వన్ సైడ్’ అన్నట్లుగా రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లోనూ కూటమి దుమ్మురేపింది. కూటమి అభ్యర్థుల మెజారిటీ 20 వేల నుంచి 80 వేల ఓట్ల వరకు ఉందంటే ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి అన్ని రౌండ్లలోనూ వైసీపీ చతికిలపడిరది. ప్రజాతీర్పు స్పష్టం కావడంతో ఆరేడు రౌండ్లు తర్వాత వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటిముఖం పట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ దక్కించుకోలేకపోయింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వైసీపీ కేవలం పది స్థానాలకే పరిమితమైంది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది. ఉమ్మడి విశాఖ, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 10 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి విశాఖలో 2, ఉమ్మడి ప్రకాశంలో ఒకటి, ఉమ్మడి కడప జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాలను వైసీపీ దక్కించుకుంది. ఐదు జిల్లాల పరిధిలోని 65 నియోజకవర్గాలకు కేవలం 11 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగతా 55 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలుపొందింది. టీడీపీ కూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉన్న జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి మొత్తం సీట్లు గెల్చి… వందశాతం విజయం నమోదు చేసి రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష హోదాకు కనీసం 18 సీట్లు కావాల్సి ఉండగా… వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ పోటీచేసిన 10 నియోజకవర్గాలకుగాను 8 స్థానాల్లో గెలిచింది. కూటమి 175 స్థానాలకుగాను 164 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కూటమి సృష్టించిన సునామీకి మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలినవారంతా ఘోర పరాజయం పొందారు. చివరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందులలోనూ ఈసారి మెజార్టీ తగ్గడం గమనార్హం. సమీప టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై జగన్ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిప్పటికీ… గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆధిక్యం ఈసారి 28 వేల మేరకు తగ్గింది. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో గతంలో అన్ని స్థానాలను వైసీపీ గెల్చుకోగా, ఈసారి సగానికే పరిమితమైంది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైసీపీ ఓటమి చవిచూసింది. హోరాహోరీ పోరు నెలకొన్న కుప్పంలో చంద్రబాబు, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారు. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, నగరిలో ఆర్కే రోజా, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.
టీడీపీ కూటమికి 21 ఎంపీ సీట్లు
పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాల్లోనూ టీడీపీ కూటమి హవా కొనసాగించింది. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకుగాను 21 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా… 2019 ఎన్నికల్లో 22 ఎంపీలు గెల్చుకున్న వైసీపీ ఈసారి కేవలం 4 సీట్లకే పరిమితమైంది. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాలను జనసేన కైవసం చేసుకుంది. కడపలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గట్టి పోటీ ఇచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఆమె మూడవస్థానానికి పరిమితమయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్రెడ్డిని ఓడిరచాలని షర్మిల, సునీత విస్తృత ప్రచారం చేసినప్పటికీ విజయం అవినాశ్రెడ్డినే వరించింది. టీడీపీ మొత్తం 16 ఎంపీ స్థానాలు గెల్చుకోగా, బీజేపీ ఆరు పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేసి మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
వైఎస్ జగన్ రాజీనామా
ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నరు అబ్దుల్ నజీర్కు అందజేశారు. కాగా, జగన్ రాజీనామాను గవర్నరు ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నరు కోరారు.