ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు ప్రమాణం
. మంత్రులుగా పవన్, లోకేశ్ సహా 24 మంది
. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సహా రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు
. ప్రజల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాల మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రి గా ఆయన ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు తో ప్రమాణం చేయించారు. చంద్రబాబునాయుడు అనే నేను… పదం పలకగానే వేదిక వద్ద కోలాహలంగా మారింది. సీఎం చంద్రబాబు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్న తరుణంలో కేరింతలు ఉత్సాహం గా నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు.
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబునాయుడుతో పదవీ ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు, విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.27 నిముషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా… ప్రధాని రాక ఆలస్యంతో మూడు నిమిషాలు ముందు కు జరిగింది. చంద్రబాబు అను నేను…అనగానే సభా ప్రాంగణం జై చంద్రన్న నినాదాలతో మార్మోగింది. కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వేదిక వద్ద ఉన్న ప్రముఖులంతా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా 24 మంది కొత్త మంత్రులచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్లతో చంద్రబాబు కొత్త కేబినెట్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
హాజరైన కేంద్ర మంత్రులు, ప్రముఖులు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పాటిల్, కింజారపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, సినీనటులు శివాజీ, నారా రోహిత్, రాంచరణ్ తదితరులు హాజరయ్యారు. నారా, మెగా కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో విచ్చేసి సందడి చేశారు.
ఆకర్షించిన విదేశీ అతిథులు
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల తరపున కాన్సల్ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ఎడ్గర్ పాంగ్ (సింగపూర్ కాన్సల్ జనరల్, చెన్నై),సిలాయ్ జకీ (ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్), చాంగ్ న్యూన్ కిమ్ (రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సల్ జనరల్, చెన్నై), టకహషి మునియో (జపాన్ కాన్సల్ జనరల్, చెన్నై) గారెత్ విన్ ఒవెన్ (బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్), థియర్రీ బెర్త్లాట్ (ఫ్రాన్స్ కాన్సల్ జనరల్, బెంగళూరు), మహ్మద్ అరిఫుర్ రెహమాన్ (బంగ్లాదేశ్ డిప్యూటీ కాన్సల్ జనరల్, చెన్నై), ఇవోట్ డెవిత్ (నెదర్లాండ్స్ కాన్సల్ జనరల్, ముంబయి), జెన్నిఫర్ అడ్రియానా లార్సన్ (యూఎస్ కాన్సల్ జనరల్, హైదరాబాద్), మహదీ షారోఖీ (కాన్సల్ జనరల్ ఆఫ్ ఇరాన్, హైదరాబాద్), సెంథిల్ తొండమాన్ ( గవర్నర్, ఈస్ట్రన్ ప్రావిన్స్, శ్రీలంక) తదితరులున్నారు.