విశాలాంధ్ర ` మార్కాపురం : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు తిప్పాయిపాలెం వద్దకు రాగానే టైరు పేలింది. దీంతో అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న మార్కాపురం సీఐ అంజనేయులు రెడ్డి, ఎస్సై సుమన్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. మృతుల్లో కారు డ్రైవర్ను చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన రావూరి తేజ(35)గా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో లారీని వదిలి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.