. చకచకా ‘ఇండియా’ సీట్ల సర్దుబాటు
. నిన్న యూపీలో ఎస్పీతో, నేడు దిల్లీలో ఆప్తో పొత్తుల ఖరారు
. దిల్లీలో 43 ఫార్ములాకు కాంగ్రెస్ అంగీకారం
. గుజరాత్లో 2, హర్యానా, అసోంలో ఒక్కో స్థానం ఇవ్వాలని నిర్ణయం
. మధ్యప్రదేశ్లో 281 లెక్కన ఎస్పీతో అవగాహన
. మహారాష్ట్రలో తుది దశకు చర్చలు
న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి మరింత బలంగా ముందుకు సాగుతోంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని, సత్తా చాటాలని కూటమి సంకల్పించింది. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్న క్రమంలో ఇండియా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్కు పొత్తు కుదిరింది. ఎస్పీ 64 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి ప్రకటించింది. గురువారం ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాంగ్రెస్ కసరత్తు చేసింది. దిల్లీతో పాటు గుజరాత్, అసోం, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు చర్చలు జరిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు స్థానాలకు కాంగ్రెస్ అంగీకరించింది. మిగతా నాలుగు స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది. దక్షిణ దిల్లీ, పశ్చిమ దిల్లీ, వాయువ్య దిల్లీ, న్యూదిల్లీ స్థానాలలో ఆమ్ ఆదీ పార్టీ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చాందినీ చౌక్, తూర్పు దిల్లీ, ఈశాన్య దిల్లీ నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని వెల్లడిరచాయి. హర్యానాలో ఒకటి, గుజరాత్లో రెండు స్థానాలను ఆప్కు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హర్యానాలో గురుగ్రామ్ లేక ఫరీదాబాద్ నుంచి ఆప్ పోటీ చేయబోతోంది. గుజరాత్లోని భరూచ్, భావ్నగర్ స్థానాలను ఆప్కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అసోంలోనూ ఆ పార్టీకి ఒక స్థానం ఇవ్వనున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ 28 స్థానాల్లో, ఎస్పీ ఒక స్థానం నుంచి పోటీ చేస్తాయి. మహారాష్ట్రలోనూ మహా వికాస్ అగాధీ (ఎంవీఏ) మిత్రపక్షాల చర్చలు తుది దశకు చేరాయి. నెలాఖరులోగా ప్రకటన వెలువడనున్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుంటే దక్షిణ గోవా లోక్సభ స్థానం నుంచి తమ పార్టీ తరపున బెనౌలిమ్ ఎమ్మెల్యే వెంజి వేగస్ పోటీ చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటించింది. గతంలో గుజరాత్లోని భరూచ్, భావ్నగర్ స్థానాలతో పాటు అసోంలో మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. అయితే తాజా చర్చల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకున్నది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.