. రాజ్యాంగ స్ఫూర్తికి, దేశ వైవిధ్యతకు, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం
. ఒక దేశం`ఒక ఎన్నిక ఆలోచనకు సీపీఐ వ్యతిరేకం
. కోవింద్ కమిటీతో భేటీలో డి.రాజా
న్యూదిల్లీ: ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ ఆలోచన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్యవాదానికి పూర్తిగా వ్యతిరేకమని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆయన బుధవారం న్యూదిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వ జమిలి ఎన్నికల ఉన్నత స్థాయి కమిటీతో భేటీ అయ్యారు. ఒక దేశం, ఒక ఎన్నికపై సీపీఐ అభిప్రాయాన్ని రాతపూర్వకంగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాజా తెలియజేశారు. లోక్సభతో పాటు అసెం బ్లీలకు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యసాధాల పరిశీలన కోసం ఈ కమిటీ ఏర్పాటైంది. కోవింద్ నేతృత్వ కమిటీని కలిసిన సందర్భంగా సీపీఐ వైఖరిని రాజా మరోమారు స్పష్టంచేశారు. ఆర్ఎస్ఎస్`బీజేపీ గుత్తాధికార సిద్ధాంతం నుంచే ఒక దేశం, ఒక ఎన్నిక ఆలోచన పుట్టుకొచ్చిందని విమర్శించారు. దేశ వైవిధ్యతకు, రాజకీయ వ్యవస్థకు ఇది ప్రమాకరమన్నారు. ఒక దేశం, ఒక ఎన్నికపై చర్చకు బదులు సమగ్ర ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల బాండ్ల నిర్మూలన, స్వేచ్ఛ, పాదర్శకత ఎన్నికలకు హామీ లభించే విధంగా రాష్ట్రాల ఎన్నికల నిధులపై ఇంద్రజిత్ గుప్తా కమిటీ సిఫార్సుల అమలు వంటి అంశాలపై చర్చించడం ఎంతో అవసరమని, ఇందుకు ఇదే సమయమని రాజా నొక్కిచెప్పారు. జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని, దీనిని భారత లా కమిషన్ ఎదుట కూడా సీపీఐ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కొనసాగనివ్వకపోవడం సమాఖ్య వాదానికి విరుద్ధమన్నారు. దేశ వైవిధ్యత దృష్ట్యా రాజ్యాంగాన్ని రూపొందించారని, బహుళపక్ష ప్రజాస్వామ్యంలో తరచూ ఎన్నికలు జరుగుతాయని రాజ్యాంగ నిర్మాతలు అంచనా వేశారన్నారు. ఇందుకోసమే భారత ఎన్నికల సంఘం ఏర్పాటు నకు రాజ్యాంగంలోని అధికరణ 324 కింద మార్గదర్శకాలు పొందుపర్చారని గుర్తుచేశారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి వారి నాయకత్వంలోని రాజ్యాంగ సభ శాసన ఉద్దేశానికి ఒక దేశం, ఒక ఎన్నిక ఆలోచన విరుద్ధమని రాజా అన్నారు. 1957లో కేరళలో సీపీఐ గెలవడంతో గుత్తాధిపత్యానికి, జమిలి ఎన్నికల సంస్కృతికి అంతం సాధ్యమైందన్నారు. 1967లో ఆధికార పార్టీ ఎనిమిది రాష్ట్రాల్లో ఓడిపోయిందని, వేర్వేరు పార్టీలు రాజకీయంగా ఎదిగాయన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ఆవిర్భవించడం/ఎదగడం వంటి కారణాలతో ఒక పార్టీ పాలన, జమిలి ఎన్నికలకు చరమగీతం పాడగలిగినట్లు రాజా వివరించారు.