2 గంటల్లోనే 20 లక్షల మంది ఓటేసిన వైనం
60 శాతం మంది ట్రంప్కే అనుకూలం
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు గురించి వార్తలు మొదలైనప్పటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్దరిస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మస్క్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ట్రంప్ను మళ్లీ ట్విట్టర్లోకి తీసుకోవాలా అనే దానిపై ఓటింగ్ పెట్టారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో శుక్రవారం సాయంత్రం ఓ పోల్ నిర్వహించారు. మొత్తంగా 24 గంటల పాటు కొనసాగే ఈ అభిప్రాయ సేకరణలో ఇప్పటికే 20 లక్షల మంది పాల్గొన్నారు. అందులో దాదాపు 60 శాతం మంది ట్రంప్ పై నిషేధాన్ని తొలగించాలని కోరారు.2021లో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఆయన ట్వీట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని, కంపెనీ నియమనిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ట్రంప్ ఖాతాను కంపెనీ తీసేసింది. అలాగే ట్రంప్ పై జీవితకాలం నిషేధం విధించింది. దీనిపై ట్రంప్ కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. ట్విట్టర్ ఆహ్వానించినా సరే తిరిగి తాను ఖాతా తెరవనంటూ వ్యాఖ్యానించారు. ఆపై ట్రూత్ సోషల్ పేరుతో తనే సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ఫాంను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ కొత్త పాలసీ గురించి మస్క్ వివరించారు. ‘విద్వేష/ప్రతికూల ట్వీట్లను గుర్తించి వాటిని డీబూస్ట్ చేయడం లేదా వాటి స్థాయిని తగ్గిస్తాం. అంటే అలాంటి ట్వీట్ గురించి ప్రత్యేకంగా వెతికితే తప్ప అవి అందరికీ కనిపించవు. అందువల్ల వాటికి ఎక్కువ రీచ్ ఉండదు. అయితే ఇది కేవలం ట్వీట్లకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం ట్విట్టర్ కాదు. ’ అని ట్వీట్ చేశారు.