. శంభు, ఖనౌరిలో పోరు ఆగదు : పంధేర్
. నిపుణులతో చర్చించాకే కేసు నమోదు : పంజాబ్ సీఎం
. శుభకరణ్ కుటుంబానికి పరిహారం, సోదరికి ఉద్యోగం హామీ
. భటిండాలో ముగిసిన యువ రైతు అంత్యక్రియలు
చండీగఢ్/జలంధర్ : తమ డిమండ్లను పరిష్కరించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని, శంభు, ఖనౌరి సరిహద్దుల వద్ద ఆందోళన కొనసాగుతుందని రైతు నేత శర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పోలీసుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభకరణ్ సింగ్ సంస్మరణ సభ మార్చి 3న భటిండాలోని బల్లో గ్రామంలో ఎస్కేఎం (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా అధ్వర్యంలో జరుగుతుందని, పెద్ద సంఖ్యలో పాల్గొని అమర రైతుకు ఘనంగా నివాళులర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత కేసు నమోదు చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం తెలిపారు. శుభకరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతో పాటు ఆయన సోదరికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామని తెలిపారు. శుభకరణ్ కేసులో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందని పంజాబ్ ఐజీ సుఖ్చెయిన్ సింగ్ వెల్లడిరచారు. పాటియాలాలోని పట్రన్ పోలీసు స్టేషన్లో హత్య కేసును నమోదు చేశారు. దీంతో బుధవారం రాత్రి శుభకరణ్ సింగ్ భౌతికకాయానికి పోస్టుమార్టం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరిస్తామని రైతులు ఇంతకుముందే తేల్చిచెప్పారు. శుభకరణ్ సింగ్ అంత్యక్రియలు గురువారం భటిండా జిల్లాలోని బల్లో గ్రామంలోగల రామ్పురా ఫుల్లో ముగిశాయి. ఎస్కేఎం, కేఎంఎం నాయకుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. తొలుత పాటియాలాలోని రాజింద్రా మెడికల్ ఆసుపత్రి నుంచి శుభకరణ్ భౌతికకాయాన్ని ఖనౌరి సరిహద్దుకు తీసుకెళ్లగా రైతులు కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయంపై రైతు సంఘాల జెండాలు కప్పి నివాళులర్పించారు.
అంబులెన్స్ వెంట కొద్ది దూరం నడిచారు. శుభకరణ్ మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. అనంతరం భటిండాలోని బల్లో గ్రామంలో శుభకరణ్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈనెల 21న పంజాబ్హర్యానా ‘ఖనౌరి’ సరిహద్దు వద్ద పోలీసులు పేల్చిన తూటా తలకు తగిలి శుభకరణ్ సింగ్ చనిపోయారు. రైతుల డిమాండ్ క్రమంలో తొమ్మిది రోజుల తర్వాత జిరో ఎఫ్ఐఆర్ను పంజాబ్ పోలీసులు దాఖలు చేశారు. ఐపీసీలోని 302 సెక్షన్ కింద హత్యారోపణలు నమోదయ్యాయి. పాస్పోర్టు
వీసాలు రద్దు చేస్తాం: హర్యానా పోలీసుల హెచ్చరిక
ఆందోళనల్లో పాల్గొనే క్రమంలో జరిగే నష్టానికి మూల్యం చెల్లించాలని, ఇందుకోసం రైతుల ఆస్తులు జప్తు చేస్తామని ఇటీవల ప్రకటించిన హర్యానా పోలీసులు తాజాగా నిరసనకారుల వీసాలు రద్దు చేస్తామని, పాస్పోర్టులు స్వాధీన పర్చుకుంటామని హెచ్చరించారు. పంజాబ్ నుంచి హర్యానాకు వచ్చి హింసలో పాల్గొంటే సీసీటీవీ ఫులేజి, డ్రోన్ కెమెరాల ఆధారంగా గుర్తించి, వారి ఫొటోలు, పేరు, చిరునామాను పాస్పోర్టు కార్యాలయాలకు పంపుతామని బెదిరించారు. తాజా పరిణామంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ను విలేకరులు ప్రశ్నించగా ‘అన్ని పాస్పోర్టు లేక వీసా వ్యవహారాలు నిబంధనావళి ప్రకారం జరుగుతాయి. సంబంధిత నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైతే వాటిని రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది’ అని చెప్పారు. బీకేయూ (ఎస్బీఎస్) నేత ఒకరు స్పందిస్తూ ‘ఆందోళనకారుల పాస్పోర్టులు స్వాధీనం చేసుకుంటామని, వీసాలు రద్దు చేస్తామని హర్యానా పోలీసులు బెదిరిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుంది’ అని అన్నారు. దిల్లీ చలోను నీరుగార్చే విధంగా రైతులను భయపెట్టే ప్రయత్నం ఆక్షేపణీయమని కొందరు రైతు నేతలు, సానుభూతిపరులు అన్నారు. ‘దిల్లీ చలో’ పోరు ఉధృతం కాగలదనే దానిని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఆరుగురు అన్నదాతలు అమరులయ్యారని, వారి త్యాగాలను వృధా కానివ్వబోమని నాయకులు తేల్చిచెప్పారు.