. ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోవడం లేదు
. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి
. నివేదికలో తేడాలుంటే చర్యలుంటాయి
. అక్రమ మైనింగ్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం నిలదీసింది. గుంటూరు జిల్లాలోని వీరంకినాయుడు పాలెంలో పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎం.ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. రెండెకరాలకే అనుమతి తీసుకుని, 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని గనుల శాఖను హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం సరిపోదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడాలు ఉండకూడదని, అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా అధికారిని కోర్టుకు పిలుస్తామని, తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సీఆర్జడ్లో నిర్మాణాలపై విచారణ
భీమిలి కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది. బీచ్ వద్ద శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. సుమారు మూడున్నర ఎకరాలకు పైగా సముద్ర తీర ప్రాంతాన్ని అవియాన్ రియల్టీ పేరిట హస్తగతం చేసుకుని అక్రమ నిర్మాణాలు ప్రారంభించారని, అందుకు ఆధారాలతో సహా ఫొటోలను కోర్టుకు అందజేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం సీఆర్జెడ్లో నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నిర్మాణ స్థలంలో ఉన్న యంత్రాలను సీజ్ చేయాలని సూచించింది. తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
రుషికొండ తవ్వకాలపై విచారణ వాయిదా
విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు, గ్రావెల్ తరలింపుపై మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తీసుకునే నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు వారాల సమయం కోరారు. ఇప్పటికే పిటిషనర్ ఎన్జీటీకి వెళ్లగా డిస్మిస్ చేశారని ప్రభుత్వం కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.