వర్షాన్ని సైతం లెక్కచేయని కార్మికులు
జంతర్మంతర్ వద్ద 4గంటల పాటు ధర్నా
వర్షాన్ని సైతం లెక్కచేయని కార్మికులు
జంతర్మంతర్ వద్ద 4గంటల పాటు ధర్నా
విశాఖ ఉక్కును రక్షించుకుంటామని ప్రతిన
కేంద్రం తలొగ్గకుంటే మూల్యం తప్పదని హెచ్చరిక
అన్ని పార్టీల, కార్మికసంఘాల నేతలు, ఎంపీలు హాజరు
అమరావతి : విశాఖ ఉక్కు ఉద్యమం దేశ రాజధానిని తాకింది. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ నినాదాలతో దిల్లీ దద్దరిల్లింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దు అంటూ.. జంతర్మంతర్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి అధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మిక, ఉద్యోగ సంఘాలు సోమవారం మహాధర్నా చేపట్టాయి. పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గ్గొన్న కార్మికులంతా స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని, స్టీల్ప్లాంట్కు గనులు కేటాయించాలని, అప్పులను ఈక్విటీలుగా మార్చాలని నినదించారు. ఈ మహాధర్నా మంగళవారం కూడా కొనసాగనున్నది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ గత 6 మాసాలుగా కార్మిక సంఘాలు సంయుక్తంగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథó్యంలో దిల్లీ వేదికగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేయాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా జంతర్మంతర్ వద్ద దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైనప్పటికీ లెక్కచేయకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2గంటల వరకు ఆందోళనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయపార్టీలకు చెందిన జాతీయనేతలు, ఎంపీలు, కార్మిక సంఘాల నేతలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్మికుల వారి సంఫీుభావాన్ని తెలిపారు. కేంద్రం తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. వైజాగ్ స్టీల్ దేశానికే గర్వకారణం...వైజాగ్ స్టీల్ను కాపాడండి...ప్రాణాలైనా అర్పిస్తాం
వైజాగ్ ఉక్కును కాపాడుకుంటామంటూ ఆందోళనకారులు నినదించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు డి.ఆదినారాయణ, సీహెచ్.నర్సింగరావు, రాజశేఖర్, అయోధ్య రామారావుతోపాటు, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, పార్లమెంటరీ పార్టీ నాయకులు బినయ్ విశ్వం, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభా వైసీపీ పక్షనేత మిథున్ రెడ్డి, ఏపీ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి అమర్జిత్ కౌర్, సీఐటీయూ జాతీయ నేత తపన్సేన్, ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డితో పాటు, వైసీపీ,టీడీపీ ఎంపీలు, ఏపీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విశాఖ స్టీల్ను దురుద్దేశపూర్వకంగానే ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం తగదన్నారు. విశాఖ ఉక్కుకు ఉన్న అప్పు రూ.22 వేల కోట్లను ఈక్విటీ కిందకు మార్చితే సంస్థ లాభాల బాట పడుతుందని చెప్పారు. ప్రైవేటీకరణ ఆలోచనలను కేంద్రం మానుకోవాలని హితవు చెప్పారు. ఇతర పీఎస్యు (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు) ఎలా మైనింగ్ యూనిట్లు కేటాయింపులు చేశారో, ఆ విధంగానే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్కు మైనింగ్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తే సంస్థకు ఆస్తిగా ఉంటుందని సూచించారు.
లోపలా, బైటా పోరాడతాం వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి,మిథున్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఇందుకోసం తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పార్లమెంటు లోపలా, బయటా పోరాడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు, లోక్సభ, రాజ్యసభలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ముందు కూడా విశాఖ ఉక్కు పరిరక్షణకై కార్మికులు చేస్తున్న పోరాటంలో మేం అంతా పాలుపంచుకుంటామని చెప్పారు. వీరితో పాటు వైసీపీ ఎంపీలు వెంకట సత్యవతి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, గోరంట్ల మాధవ్, ఎంపీ మార్గాని భరత్, గురుమూర్తి పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధ, బెల్లాన చంద్రశేఖర్, కోటగిరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి పోరాడి కాపాడుకుందాం
టీడీపీ ఎంపీలు
ఎందరో బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పార్టీలకతీతంగా అందరం కల్సి పోరాడి కాపాడుకుందామని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటు లోపలా, బయటా పోరాటం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలన్నీ కలిసి పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.