ముగ్గురూ విదేశాల నుంచి వచ్చినవారే..
మూడో పాజిటివ్ కేసు కూడా కేరళలోనే గుర్తింపు
ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ మన దేశంలోనూ అలజడి రేపుతోంది. ఇప్పటికే రెండు మంకీ పాక్స్ కేసులు నమోదుకాగా.. తాజాగా మరో వ్యక్తికి కూడా మంకీపాక్స్ సోకినట్టు గుర్తించారు. మొత్తం మూడు కేసులు కూడా కేరళలోనే నమోదవడం గమనార్హం.ఈ నెల 6వ తేదీన యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల యువకుడికి మంకీ పాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తికి ఇటీవల చర్మంపై దద్దుర్లు, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్కు పంపగా.. మంకీ పాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని వెల్లడిరచారు. కేరళలోని మంజేరి మెడికల్ కాలేజీలో ఆ యువకుడిని ఉంచి చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. సదరు యువకుడితో కలిసి ఉన్న, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి ఐసోలేషన్ చేశామని.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
మంకీ పాక్స్ లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు మొదటి రకానివని, అది మరీ ప్రమాదకరం కాదని పేర్కొంది. అయితే ఆఫ్రికాలోని కాంగోలో బయటపడిన మరో రకం మంకీ పాక్స్ వైరస్ మాత్రం ప్రమాదకరమని.. దానివల్ల 10 శాతం మేర మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.