ఆస్కార్లో సత్తా చాటిన తెలుగు పాట
. ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు
. ఆస్కార్ అవార్డుల్లో తొలిసారి విజయకేతనం ఎగరేసిన భారతీయ చిత్రం
. ఎస్ఎస్ రాజమౌళి శ్రమకు దక్కిన ఫలితం
. ఎంఎం కీరవాణి సంగీతానికి లభించిన గౌరవం
. చంద్రబోస్ సాహిత్యానికి, సిప్లిగంజ్, కాలభైరవ ఆలాపనకు అందిన పురస్కారం
. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వానికి అందివచ్చిన గొప్ప వరం
లాస్ఏంజెల్స్: మన ‘నాటు నాటు’ పాట సినీ విశ్వయవనికపై దుమ్మురేపింది. భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలోనే ఎవరూ ఊహించని విధంగా, ఏనాడూ జరగని విధంగా భారతీయ సినిమాకు తొలి ఆస్కార్ అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించింది. ఒక భారతీయ సినిమాకు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి. గతంలో అనేక ఆస్కార్ అవార్డులు భారతీయ నిపుణులకు లభించినప్పటికీ, అవి భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన సినిమాలు కావు. టాలీవుడ్ ఫిల్మ్ ఆస్కార్ అందుకోవడం మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక బ్రేక్. నాటు నాటు గీతానికి అవార్డు రావడం, ఆస్కార్లో తొలిసారి తెలుగు పాట సత్తా చాటడం అనేది నిజంగానే ఎస్ఎస్ రాజమౌళి శ్రమకు దక్కిన ఫలితమే. ఎంఎం కీరవాణి సంగీతానికి లభించిన గౌరవం కూడా. అంతేగాకుండా, చంద్రబోస్ సాహిత్యానికి, సిప్లిగంజ్, కాలభైరవ ఆలాపనకు అందిన పురస్కారంగా భావించవచ్చు. అన్నింటికీ మించి ఈ పాటకు అద్భుతమైన డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్కు ఈ పురస్కారం ఒక గొప్ప వరంగా పరిగణించవచ్చు. ఈ డ్యాన్స్తోనే నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండిరగ్గా మారిపోయింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటతోపాటు అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్ గన్: మావెరిక్), లిఫ్ట్ మి అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ ఏ లైఫ్ (ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ ఒన్స్) కూడా పోటీ పడినప్పటికీ, చివరకు నాటు నాటుకే విజయం దక్కింది. ఒరిజినల్ సాంగ్ విజేత నాటు నాటు అని ఆస్కార్ వేదికపై ప్రకటించగానే ఈ పాట అభిమానులు ఒక్కసారిగా వేడుకల్లో మునిగిపోయారు. ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం. స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత చిత్రాన్ని తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. ఇదొక విజువల్ వండర్గా నిలిచిపోయింది. నిజానికి ఈ సినిమాను భారత్ నుంచి ఆస్కార్కు సిఫార్సు చేయాల్సిన కమిటీ విస్మరించింది. దీంతో రాజమౌళి బృందం స్వయంగా రంగంలోకి దిగి స్వతంత్రంగా దరఖాస్తు చేసుకొంది. ఆ రకంగా ఆర్ఆర్ఆర్ భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయి సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టిఆర్, రాంచరణ్, అలియా భట్, అజయ్ దేవ్గణ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు పొందక ముందు ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డులను కైవసం చేసుకుంది. ఆస్కార్ అవార్డు కోసం వివిధ కేటగిరీలలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కేవలం ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మాత్రమే ఆర్ఆర్ఆర్కు నామినేషన్ లభించింది. నామినేషన్ దక్కినప్పటి నుంచి అనూహ్యమైన రీతిలో నాటునాటు పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండిరగ్ సాంగ్గా రికార్డులు సాధించింది. ఈ సాంగ్కు స్టెప్లు వేయడానికి ప్రతి దేశంలోనూ కుర్రాళ్లు ఉవ్విళ్లూరిపోయారు. ఒరిజినల్ సాంగ్ తెలుగు భాష కావడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు కూడా అనుకోని ప్రతిష్ట వచ్చేసింది. తెలుగు అనే పదమే ట్రెండిరగ్గా మారిపోయింది. కనీసం ఆరు మాసాలపాటు సామాజిక మాధ్యమాల్లో ఆర్ఆర్ఆర్ ట్రెండిరగ్లో ఉండటం ఒక రికార్డు. తాజాగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలోనూ ఈ పాటకు నృత్య ప్రదర్శన జరిగిన సందర్భంలో సభికులంతా హాలులో కాలు కదపడం విశేషం. ఇదిలావుండగా, ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు లభించడం పట్ల భారత రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిసింది. ఆర్ఆర్ఆర్ చిత్ర బడ్జెట్ సుమారు 300 కోట్ల రూపాయలు కాగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. మొదట్లో ఈ చిత్రం 2021 అక్టోబరు 13న విడుదల కావాల్సి ఉండగా, 2019-21 కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని 2022 మార్చి 25గా ప్రకటించారు.
ఈ సినిమా విడుదలైన 15 రోజుల్లో 1000 కోట్ల క్లబ్కు చేరుకుంది. ఆర్ఆర్ఆర్ మే 20న జీ5 ఓటీటీలో విడుదలయింది. ఈ సినిమా మార్చి 25న విడుదలై, ఏప్రిల్ 14 నాటికి 500 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. జపాన్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. 2022 అక్టోబరు 21న జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదల కాగా 42 కేంద్రాల్లో నేరుగా, షిఫ్ట్స్ పద్ధతిలో మరో 114 కేంద్రాల్లో వందరోజులు పూర్తిచేసుకుంది. దీంతో ఈ రికార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన చిత్రాలు కేవలం 11 మాత్రమే. భారత సినిమా అంటే బాలీవుడ్ మాత్రమేనని ప్రపంచం విశ్వసించేది. అయితే రాజమౌళి బాహుబలి సినిమా విడుదల తర్వాత బాలీవుడ్ వెనక్కి పోయి టాలీవుడ్ ముందుకొచ్చింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. ఆనాటి నుంచి బాహుబలి`2, ఆర్ఆర్ఆర్ మూవీలు ఆ రేంజ్ని ఇంకా పెంచేశాయి. పైగా రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర దక్షిణాది చిత్ర దర్శకులు సైతం పాన్ ఇండియా చిత్రాలు రూపొందించడం ఆరంభించారు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ వంటి పేర్లు కనుమరుగై, అన్నీ భారతీయ చిత్రాలుగానే విడుదలయ్యే ధోరణి మొదలైంది. రాజమౌళి తొలిచిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరో. ఎన్టీఆర్తో ఆయన నాలుగు చిత్రాలు తీశారు. రామ్చరణ్తో రెండు చిత్రాలు తీశారు. రాజమౌళి తన తదుపరి చిత్రంగా సూపర్స్టార్ మహేశ్బాబుతో మరో సాహసోపేతమైన చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. రాజమౌళి తీసిన అన్ని చిత్రాలకూ ఆయన సోదరుడు ఎంఎం కీరవాణియే సంగీత దర్శకత్వం వహించారు. నాటు నాటుతో ఆయన విశ్వవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. రాజమౌళి భారతదేశ జాతి సంపద అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.