. 23న మళ్లీ పరీక్ష
. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
. వెబ్ కౌన్సెలింగ్ ఆపేదిలేదన్న సుప్రీం
న్యూదిల్లీ: వైద్యకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్’ పరీక్షలో భారీగా అక్రమాలు జరిగాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 1,563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని, వారికి జూన్ 23న తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు నీట్ కౌన్సెలింగ్ను ఆపేది లేదని, కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల వీటిని కలిపారు. ఇలా మార్కులు కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, నీట్ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడం వల్ల కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టు సమర్పించింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని కేంద్రం సుప్రీంకు తెలిపింది. గ్రేస్ మార్కులు రద్దు చేసిన వారికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్కు వెళ్లొచ్చని పేర్కొంది.
కౌన్సెలింగ్పై స్టే నిరాకరణ
ఇదిలాఉండగా 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఎడ్టెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… వెబ్ కౌన్సెలింగ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, దానికి ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. నీట్-యూజీ 2024ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను జూలై 8న విచారణ జరుపుతామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తెలిపింది. జులై 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు దాఖలు చేసిన పిటిషన్తో కలిపి విచారణ చేపట్టనున్నారు.
పేపర్ లీక్కు ఆధారాలు లేవు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ యూజీసీ పేపర్ లీక్కు ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. 1563 మంది విద్యార్థులకు జూన్ 23న పునఃపరీక్ష నిర్వహిస్తామని, ఫలితాలు జూన్ 30న ప్రకటిస్తామని, జూలై 6న కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని ప్రధాన్ వెల్లడిరచారు. నీట్ పరీక్షలో ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పిన ప్రధాన్…దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అయితే ఈ పరీక్షల్లో ఏదైనా అవినీతి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.