కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యలు
కోల్కతా: పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఉత్పత్తులు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందుకే దేశంలో పెట్రోల్ ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. భవానీపూర్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కోల్కతా వచ్చిన ఆయన పీటీఐకి గురువారం ఇంటర్వ్యూ ఇచ్చారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని అనుకుంటున్నారా? అని మీరు(మీడియాను ఉద్దేశిస్తూ) అడిగితే మా సమాధానం ‘అవును’ అని చెబుతామన్నారు. అదే పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? అని అడిగితే మాత్రం.. దానికి కారణం రాష్ట్రాలే అని చెప్పాల్సి ఉంటుందని పురి పేర్కొన్నారు. ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించట్లేదని, లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వచ్చే వాటా 32 రూపాయలు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు 19 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్పై రూ.32 పన్ను వసూలు చేశాం. ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధర బ్యారెల్కు 75 డాలర్లుగా ఉంది. అయినప్పటికీ కేంద్రం రూ.32 మాత్రమే వసూలు చేస్తోంది. దీంతోనే కేంద్రం ఉచిత రేషన్, ఉచిత గృహాలు, ఉజ్వల వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి 45వ సమావేశంలో పెట్రోఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే.