. పంచాయతీ ఎన్నికల వేళ హింస
. పేలిన బాంబులు – బూత్లు ధ్వంసం
. బ్యాలెట్లకు నిప్పు
. వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
. మృతుల్లో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల వేళ రక్తపాతం జరిగింది. ప్రశాంతంగా జరగాల్సి పోలింగ్ హింసాత్మకంగా మారగా అనేకచోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. బ్యాలెట్ బాక్సులు చోరికి గురయ్యాయి. కొన్ని చోట్ల వాటిని ధ్వంసం చేశారు. బ్యాలెట్లకు నిప్పుపెట్టారు. బూత్లనూ ధ్వంసం చేశారు. రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు కాగా సీపీఎం కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కార్యకర్తలున్నారు. హింసపై పార్టీల పరస్పరం నిందారోపణలు చేసుకున్నారు. సుమారు 17 జిల్లాల్లో రిగ్గింగ్, నకిలీ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ముర్షిదాబాద్, నాడియా, కూచ్బిహార్, దక్షిణ 24 పరాగణాలు, పుర్బా, మెడ్నిపూర్లోని నందిగ్రామ్ ప్రాంతాలు హింసకు కేంద్రాలుగా మారాయి. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కూచ్బెహార్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్ పత్రాలను దగ్ధం చేశారు. రాణినగర్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలో కొందరు గాయపడ్డారు. జల్పాయ్గురిలో టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేకచోట్ల నిషేధాజ్ఞలు అమలయ్యాయి. 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు.
66.2శాతం పోలింగ్ నమోదు
2024 లోక్సభ ఎన్నికలకు అగ్నిపరీక్షగా పంచాయతీ ఎన్నికలకు ఉన్నందున రాజకీయ పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా భావించాయి. శనివారం ఉదయం 6 గంటలకు 73,887 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. 2.06లక్షల మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 5.67కోట్ల అర్హులైన ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 66.2శాతం పోలింగ్ నమోదైంది. వెస్ట్ మిడ్నాపూర్లో అధికంగా 79.1శాతం నమోదైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు తెలిపారు.
రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్ ` ఎన్నికల రద్దుకు కాంగ్రెస్ పిటిషన్
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి (బీజేపీ) డిమాండ్ చేశారు. ఎన్నికల హింసకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసమున్న కాలిఘాట్కు ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. స్వేచ్ఛ, పారదర్శకంగా ఎన్నికలు జరగడం మిధ్య అని, రాష్ట్రపతి పాలనలో అధికరణ 355 కింద మాత్రమే ఎన్నికలు అలా జరుగుతాయన్నారు. డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రారంభించక ముందే బ్యాలెట్ బాక్సులో ఓట్లు వేశారని బీజేపీ ఆరోపించింది. అధికారి ఆరోపణలను టీఎంసీ ఖండిరచింది. హింస వెనుక తమ పార్టీ ఉంటే సొంత కార్యకర్తలు ఎందుకు ప్రాణాలు కోల్పోతారని ప్రశ్నించింది. బీజేపీ సొంత కథనాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది.బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య గొడవలు శుక్రవారం రాత్రి నుంచి జరుగుతూ షాకింగ్ ఘటనలు వెలుగుచూస్తుంటే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నట్లు అని టీఎంసీ సీనియర్ నేత శశిపంజా వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 60వేలకుపైగా బూత్లు ఉంటే కేవలం 60 బూత్లలోనే హింస జరిగి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగినట్లు టీఎంసీ తెలిపింది. హింస జరిగినందున నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టు సీజేకు కాంగ్రెస్ నేత బాగ్చి ఫిర్యాదు చేశారు.
బాధితులకు గవర్నర్ పరామర్శ
ప్రజాస్వామ్యానికి పవిత్రమైన రోజున ఇలా రక్తపాతం జరగడం ఆందోళనకరమని గవర్నర్ సీవీ ఆనంద బోస్ అన్నారు. ఆయన ఉత్తర 24 పరాగణాల జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలను సందర్శించి హింసలో గాయపడినవారిని పరామర్శించారు. తన కాన్వాయ్ను ఆపాలని ప్రజలు కోరారని, చుట్టూ జరిగే హత్యల గురించి వాపోయారని విలేకరులతో మాట్లాడిన బోస్ అన్నారు. పోలింగ్ బూత్లకు వెళ్లకుండా గూండాలు అడ్డుకుంటున్నారని కొందరు చెప్పినట్లు తెలిపారు. ప్రిసైడిరగ్ అధికారులు ఓటర్లను పట్టించుకోవడం లేదని తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.