90 రోజుల్లో రూ.25 వేల కోట్ల రుణ సేకరణ
మిగిలింది రూ.5వేల కోట్లే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం రిజర్వుబ్యాంకు నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు తీసుకురావడాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా మరో రూ.3 వేల కోట్ల అప్పును రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సేకరించింది. వీటిలో వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 16 సంవత్సరాలకు 7.52 శాతం వడ్డీతో రుణం పొందింది. ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.46 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ మూడు వేల కోట్లతో ఇప్పటివరకూ ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ. 25,500 కోట్లకు చేరింది. ఇదంతా కేవలం 90 రోజుల్లో కావడం గమనార్హం. ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎం పరిమితిలో ఇక మిగిలింది ఐదు వేల కోట్లు మాత్రమే. ప్రభుత్వ తీరును గమనిస్తుంటే మిగిలిన రూ.5 వేల కోట్లు ఈ నెలలోనే మరో రెండు మంగళవారాల్లో సేకరించే అవకాశం కనపడుతోంది. ఇక ఆగస్టు నుంచి మరలా కేంద్రం అప్పు పరిమితి పెంచితే తప్ప ఆర్బీఐ వేలంలో పాల్గొనే అవకాశం లేదు. వాస్తవానికి ఏప్రిల్ నుంచి డిసెంబరు నెల వరకు రూ.30,500 కోట్లు అప్పు చేసుకోవడానికి కేంద్రం అనుమతించగా, రాష్ట్ర ప్రభుత్వం దానిని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసే పరిస్థితి ఏర్పడడంతో ఆగస్టు తర్వాత పరిణామాలపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.