14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
విభజన హామీలపై దృష్టి పెట్టాలి
నదుల అనుసంధానంపై ప్రణాళికలు
పౌరసరఫరాల బకాయిలపైనా దృష్టి
ఎఫ్డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజన ప్రస్తావన
సన్నాహక సమావేశంలో సీఎం వైఎస్ జగన్
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి రానున్నది. చాలాకాలం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశాన్ని బుధవారం స్వయంగా ప్రస్తావించారు. తిరుపతిలో ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. సమావేశంలో ప్రత్యేక హోదాపై చర్చించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండిరగు అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు సీఎంకు వివరించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవెన్యూలోటు, రేషన్ బియ్యంలో హేతుబద్ధతలేని కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన పౌరసరఫరాల బకాయిలపై చర్చించాలని సమావేశం నిర్ణయించింది. సీఎం మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రస్తావించడం వల్ల చర్చ జరిగి రాష్ట్రానికి మేలు జరిగే అవకాశముంటుందని సూచించారు. వాటితోపాటు ఎఫ్డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలన్నారు. జూరాల ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలన్న అంశాన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలపైన, రాష్ట్రానికి మేలు జరిగే ప్రాజెక్టులు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే, వాటిపైనా తగిన రీతిలో సిద్ధమవ్వాలని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తిరుపతిలో జరగనుంది. దీనికి ఏపీతోపాటు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్, నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ హాజరవుతారు. సన్నాహక సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్టేట్ రీఆర్గనైజేషన్) ఎల్.ప్రేమచంద్రారెడ్డి, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి జి.విజయ్కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎ.రవిశంకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, చిత్తూరుజిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.