కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి
భారీవర్షాలు, వరదలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా జోరు వాన పడుతుంది. రాయ్గఢ్, రత్నగిరి, కొల్హాపూర్ సహా పలుజిల్లాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రాయ్గఢ్లోని మహద్ తలై సహా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు చిక్కుకుని ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 36 మంది ( 32 మంది తలైలో, నలుగురు సఖర్ సుతార్ ప్రాంతంలో) మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఉదయం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డును అధికారులు రంగంలోకి దింపారు. రోడ్లపై బురద, శిధిలాల కారణంగా రెస్క్యూ బృందాలు స్పాట్కు చేరడానికి ఇబ్బంది పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ముంబై-గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.