. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం
. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను కోల్పోతున్నాం
. రాష్ట్రం కోలుకోవాలంటే ప్రత్యేక హోదా అనివార్యం
. అది ఇండియా కూటమితోనే సాధ్యం
. రాష్ట్రం మేలు కోసం టీడీపీ, వైసీపీ నిర్ణయం తీసుకోవాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అప్పులపాలైన ఏపీ కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం వల్లనే ప్రత్యేక హోదా అమలు సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని, ఇండియా కూటమికి అనుకూలంగా మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు. అందువల్ల చంద్రబాబు, జగన్ కుర్చీ కోసం ఆరాటం వదిలి… రాష్ట్రానికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని, ప్రత్యేక హోదా, విభజన అంశాలు అమలు చేసే ఇండియా కూటమికి అండగా నిలవాలని సూచించారు. విజయవాడ దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జల్లి విల్సన్, జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో పదేళ్లు ముగుస్తుండగా… విభజన అంశాల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం విచారకరమన్నారు. పైగా ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్పైనా ఆదివారంతో హక్కు కోల్పోతున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. కడప ఉక్కు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు ఊసే లేదు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మొండిచేయి చూపారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు చేశామని చెబుతూనే… రాష్ట్ర ప్రభుత్వమే భూమి ఇవ్వలేదని కేంద్రం బొంకుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పదేళ్లుగా పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై నెపం నెడుతూ నీరుగార్చారు. గతంలో చంద్రబాబుకి పోలవరం ఏటీఎంలా మారిందని విమర్శించిన ప్రధాని మోదీ… ఇప్పుడు ఆయనను పక్కనబెట్టుకుని జగన్కు రూ.15వేల కోట్లు ఇచ్చినా పూర్తి చేయలేకపోయాడని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయలేనప్పుడు నిర్మాణ పనులను మీరే చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రధాని హోదాలో ఇంత బాధ్యతారాహితంగా మాట్లాడటం మోదీకే చెల్లిందని ఆయన విమర్శించారు. ఇక పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ముగిసిన అధ్యాయమంటూ మోదీ మొండిచేయి చూపారు. ఇలా అన్ని విధాలుగా ఏపీకి పదేళ్లుగా తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైసీపీ, టీడీపీ నోరు విప్పి మాట్లాడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో విభజన అంశాల అమలు కోసం ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బైటకు వచ్చి పోరాడిన చంద్రబాబు… తనకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ ఆలోచనా విధానం ఇప్పటికైనా మారాలన్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా మీ కుర్చీ కోసం ఆరాటపడటం ఆపి… రాష్ట్రానికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని మోదీ ఆడిన మైండ్గేమ్ పటాపంచలవబోతోందని, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, బకాయిల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గవర్నర్ను కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమెకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ఎలా తెలుసుకోవాలో… కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే అవకాశం లేదనే విషయం ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ నాటకాలంటూ ఆయన విమర్శించారు. వివేకానంద స్మారక స్థలంలో నరేంద్రమోదీ ధ్యానంపై ప్రశ్నించగా… ఆయన చేసేది మెడిటేషన్ కాదు, మీడియా అటెన్షన్ అంటూ ఎద్దేవా చేశారు. సర్వమతాలు సమానమని మానవాళికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని, మత విద్వేషాలు రేపడం, ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ చిచ్చు రేపుతూ రాజకీయ లబ్ధి పొందాలని యత్నించడం మోదీ నైజమని రామకృష్ణ విమర్శించారు. మోదీ ఎన్ని డ్రామాలాడినా మళ్లీ ప్రధాని కాలేరని పేర్కొన్నారు. జి.ఓబులేసు మాట్లాడుతూ ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్పై హక్కు కోల్పోవడం వల్ల ఉపాధి, వైద్య సౌకర్యాల విషయంలో తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో ప్రధాని మోదీ ఇప్పటివరకు సెలవుదినంగా పాటిస్తున్న ఆదివారం స్థానంలో సోమవారం చేర్చాలని యత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు.