రాజకీయ పార్టీలకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎంపికైన 48 గంటల లోపు వారికి సంబంధించిన క్రిమినల్ పూర్వాపరాలను ప్రచురించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 13 న ఇచ్చిన తీర్పును సవరించింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం..అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్ల దాఖలుకు మొదటితేదీకి రెండు వారాల ముందు వారి నేరరికార్డులను ప్రకటించాలి. అయితే ఇప్పుడా ఆదేశాలకు మార్పులు చేస్తూ.. ఆయా పార్టీలే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టాల్సిందిగా ధర్మాసనం స్పష్టంచేసింది.తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టని పార్టీల గుర్తులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.