రావుల వెంకయ్య డిమాండ్
న్యూదిల్లీ : రైతాంగ ఉత్పత్తులకు లాభసాటి ధర చెల్లించేలా పార్లమెంటులో చట్టం చేయాలని అఖిల భారత కిసాన్సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య డిమాండు చేశారు. కిసాన్ సంయుక్త మోర్చా అధ్వర్యాన ఢల్లీిలోని జంతర్మంతర్ వద్ద బుధవారం జరిగిన కిసాన్ పండగ (రైతుల పార్లమెంటు)లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల పార్లమెంటుకు మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు స్పీకర్గాను, డిప్యూటీ స్పీకర్గా జగజీత్సింగ్ వ్యవహరించారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ స్వేచ్ఛా వాణిజ్య ముసుగులో మార్కెట్ కమిటీలను రద్దు చేసి, కేంద్రప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహించేలా నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు ఉపసంహరించాలని డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకొచ్చేలా కేంద్రంపై ఒత్తిడితేవాలని రైతాంగాన్ని కోరారు. మూడు దశలుగా జరిగిన, కిసాన్ సన్సద్కు బూటాసింగ్ బూర్జుగిల్, డా॥ శైలజ ధన్యవాల్లు స్పీకర్లుగా, డిప్యూటీ స్పీకర్లుగా హవాసింగ్, అంత్రన్, కిరణ్ జత్సింగ్ వ్యవహరించారు. సీనియర్ రైతు నాయకులు యుద్ధవీర్ సింగ్ సభికులకు ఆహ్వానం పలకగా చౌదరి జోగేంద్ర వందన సమర్పణ చేశారు. రైతుల పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ నుండి రైతాంగ సమన్వయ కమిటీ నాయకులు పి.నరసింహారావు, కొల్లా రాజమోహన్, చుండూరి రంగారావు, డి.హరనాథ్, జెట్టి గురునాథరావు, కె.కాటమయ్య, ఎం.యల్లమందారావు, కె.వీరారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.సుబ్బారావు, రాజగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.