. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ
. ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత…అవసరమైతే ఈడీకీ సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై బుధవారం శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయన్నారు. నేరస్థుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లలో చూశాం. మద్యపాన నిషేధం, లిక్కర్ ఔట్లెట్స్ తగ్గింపు అని చెప్పి అడ్డగోలుగా దోపిడీ చేశారని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పారు. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారు. అయినా మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయింది. అయినా ఏపీలో ఆదాయం తగ్గింది. ఎందుకంటే ఆ ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది. మద్యం షాపుల్లో కేవలం నగదు మాత్రమే తీసుకున్నారు. దాదాపు లక్ష కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వ శాఖలో ఇలా జరగడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. దేశంలో దొరికే లిక్కర్ బ్రాండ్లు ఏవీ ఏపీలో లేవు. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారు. చెల్లింపు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వారిని వేధించారు. లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో అధిక ధరలకు విక్రయించారు. వారు ఏవి అమ్మితే ప్రజలు అవే తాగే పరిస్థితిని కల్పించారు. మద్యం ఓ వ్యసనం. పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతారు. వారి అలవాటును బలహీనంగా చేసుకొని దారుణంగా దోచుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బు తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారు. దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వాటిల్లింది. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూడటంతోపాటు డీఅడిక్షన్ సెంటర్లనూ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఏ విధంగా ప్రక్షాళన చేయాలో శాసనసభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలి. మంత్రులంతా వారి శాఖల్లోని అవకతవకల్ని వెలికితీయాలని చంద్రబాబు సూచించారు.
మద్యం కుంభకోణానికి బాధ్యులను శిక్షించాలి: పవన్
ఎక్సైజ్శాఖకు సంబంధించి శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలే జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎక్సైజ్శాఖ శ్వేతపత్రంపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ఈ శాఖ వల్ల రూ.18 వేల కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. దీనికి కారకులైన వారిని కచ్చితంగా శిక్షించాలన్నారు. తప్పు చేసిన వారిని వదిలేస్తే భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డాం. అదే ఎక్సైజ్శాఖ నుంచి ఖజానాకు రావాల్సిన రూ.18 వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రూ.20 వేలు లంచం తీసుకున్న ఓ సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నాం. ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని పవన్ స్పష్టం చేశారు.