. 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
. తెలంగాణలో నాలుగు స్థానాల అభ్యర్థులు ఖరారు
న్యూదిల్లీ : లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీట్ల కసరత్తును ముమ్మరం చేసింది. ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. కేరళకు చెందిన వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ రెండోసారి పోటీ చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కె.సి.వేణుగోపాల్ కేరళలోని అలుప్పుజ నుంచి, ఇక సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ వరుసగా నాల్గవ సారి తిరువనంతపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అయిన శశి థరూర్ 2009 నుంచి ఈ స్థానంలో గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో జనరల్ విభాగం నుంచి 15 మంది అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) నుంచి 24 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఈ జాబితాను వెల్లడిరచిన కేసీ వేణుగోపాల్ తెలిపారు. చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ రాజ్నంద్గావ్ నుంచి, రాష్ట్రంలోని మహాసముంద్ స్థానం నుంచి మాజీ మంత్రి తామ్రధ్వజ్ సాహూ, కోర్బా నుంచి జోత్స్నా మహంత్ పోటీ చేయనున్నారు. అలాగే, తెలంగాణా రాష్ట్రంలో 18 లోక్సభ స్థానాలు ఉండగా, నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ ఉన్నారు. ఇదిలాఉండగా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 60 లోక్సభ స్థానాలపై చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దిల్లీ, కర్నాటక, కేరళ, చత్తీస్గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, లక్షద్వీప్ల్లో లోక్సభ స్థానాలపై కసరత్తు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు వి.డి.సతీశన్ మాట్లాడుతూ కేరళలో 16 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని, అలాగే మరో నాలుగు స్థానాల్లో తమ మిత్రపక్షాలు పోటీ చేస్తాయని తెలిపారు. ‘ఈ 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే దానిపై సీఈసీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏఐసీసీ శనివారం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది’ అని సతీశన్ అన్నారు. కాగా రాహుల్ గాంధీని కేరళలోని వయనాడ్ స్థానం నుంచి తిరిగి పోటీ చేయాలని డిమాండ్ వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ దిల్లీ ఇన్ఛార్జ్ దీపక్ బబారియా మాట్లాడుతూ దిల్లీలో పార్టీ పోటీ చేసే మూడు స్థానాల్లో అభ్యర్థుల కోసం ప్రాథమిక చర్చ జరిగిందని, మిగిలిన నాలుగు స్థానాల్లో ‘ఇండియా కూటమి’ భాగస్వామి ఆప్ పోటీ చేస్తుందని తెలిపారు. దిల్లీ సీట్లపై మార్చి 11న మరోసారి చర్చించనున్నామన్నారు. చత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్.సింగ్ దేవ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. ఈ సీఈసీ సమావేశానికి ఖడ్గేతో పాటు పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వేణుగోపాల్, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. గతవారం బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ గాంధీ అమేథి నుంచి, గతంలో సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయవచ్చు. ఈ రెండు స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పరిగణించబడుతున్నాయి. కాంగ్రెస్ మొదటి కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు అక్కడ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్థానిక శాఖలు కోరుతున్నాయి. గతంలో అమేథీ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ 2019లో ఓడిపోయినా కేరళలోని వయనాడ్ నుంచి గెలిచారు. కాంగ్రెస్లోని అనేక రాష్ట్ర శాఖలు ఇప్పటికే తమ తమ స్క్రీనింగ్ కమిటీల సమావేశాలను నిర్వహించి, తమ రాష్ట్రాల్లో సంభావ్య అభ్యర్థుల జాబితాను పంపించాయి. సీఈసీ ఇతర సభ్యులుగా అంబికా సోని, అధిర్ రంజన్ చౌదరి, టి.ఎస్.సింగ్దేవ్, మహమ్మద్ జావేద్ ఉన్నారు.