సంతోశ్ కుమార్ పిలుపు
మణిపూర్పై మోదీ మౌనం వీడాలని డిమాండ్
విశాలాంధ్ర – హైదరాబాద్ : మతవిద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలని, నిరంకుశ పాలకులను గద్దె దించేందుకు ప్రజాస్వామ్య, లౌకికశక్తులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ ఎంపీ పి.సంతోశ్ కుమార్ పిలుపునిచ్చారు. మణిపూర్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, నిర్వాసితులైన వేలాదిమందికి ప్రత్యేక ప్యాకేజీని తక్షణమే మంజూరు చేయాలని, శాంతి నెలకొల్పే చర్చలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్లో పరిస్థితులపై ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. ప్రజల మధ్య ఏర్పడిన వైరుధ్యాలను, విద్వేషాలను రూపుమాపాలని, అందరి అభిప్రాయాలను తెలుసుకుని ఈ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్రపంచ శాంతి దూతగా చెప్పుకునే ప్రధాని మాణిపూర్లో శాంతిని నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని సంతోశ్ కుమార్ ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రశాంత మాణిపూర్లో విద్వేషాలు రెచ్చగొట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ వర్క్షాప్ హైదరాబాద్, హిమాయత్నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్లో జరిగింది. రెండవ రోజు సెషన్కు ముఖ్య అతిథిగా సంతోశ్ కుమార్ హాజరయ్యారు. తన తాజా మణిపూర్ పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర దీన స్థితిని వివరించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వైఫల్యాలను నొక్కిచెప్పారు. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన హింస రాజకీయ, సామాజిక పరమైనదేగానీ శాంతిభద్రతల సమస్య కాబోదని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ విధానాలనే ఈ కల్లోల పరిస్థితులకు కారణమని విమర్శించారు. ఎన్నికల ప్రయోజనాలకు ప్రజల మధ్య చీలికలు ఏర్పడ్డాయన్నారు. అధికార బీజేపీపై మణిపూర్ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని సంతోశ్ కుమార్ అన్నారు. ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సుఖేందర్ మహేసరి, తిరుమలై రామన్ మాట్లాడుతూ అధికారంలో కార్పొరేట్, మతోన్మాదశక్తులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కృత్రిమ మేథస్సు (ఏఐ), కంప్యూటర్, డిజిటలీకరణ వంటి అంశాలతో జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. హక్కుల కోసం, ప్రజల భవిష్యత్ కోసం పోరాడక తప్పబోదన్నారు. ఇదిలావుంటే, ఆదివారం సెషన్లో ‘కులం, మతం-సామాజిక న్యాయం’ అంశంపై అఖిలభారత విద్యాశాఖ సభ్యులు యుగల్ రాయులు, ‘సామాజిక మాధ్యమాల్లో యువజన సంఘ పాత్ర’పై అఖిలభారత సామాజిక మాధ్యమాల శాఖ సభ్యులు దినేష్ రఘునాథ్ బోధించారు. ఏఐవైఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ జిస్మాన్, లెనిన్ బాబు, అరుణ్, విక్కీ, హరీశ్బాల, భారతి, కరంవీర్ కౌర్, ఏఐవైఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, యుగంధర్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సల్మాన్ బైగ్, టి.సత్య ప్రసాద్తో పాటు 23 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.