. ప్రభుత్వ కళాశాలల్లో ‘కార్పొరేట్’ ఎంట్రీ
. ఐఐటీ, నీట్ కోచింగ్ బాధ్యతలు
. ఇంటర్ బోర్డు ఏకపక్ష నిర్ణయంపై అనుమానాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోకి ఐఐటీ, నీట్ శిక్షణ పేరుతో ఓ కార్పొరేట్ విద్యా సంస్థ ప్రవేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారికి ఐఐటీ, నీట్ శిక్షణ ఇప్పించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ… ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు అప్పగించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా వ్యాపారం చేస్తున్న ఓ సంస్థకు ఇలాంటి బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరుజిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 50మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేసి… అక్కడే ఉన్న కార్పొరేట్ యాజమాన్య కళాశాలలకు రోజువారీ శిక్షణకు పంపేందుకు బోర్డు నిర్ణయించింది. తద్వారా విజయవాడ, ఏలూరు, గుంటూరు, తిరుపతి తదితర నగరాల్లో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల నేతృత్వంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ విద్యలో గందరగోళం ఏర్పడుతుందన్న విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 246 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ఇందులో 5వేలకుపైగా లెక్చరర్ల ఖాళీలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లెక్చరర్లలో అత్యధికంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలోనే ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థికంగా వెనుకబాటుకు గురైన పేద విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. వారికి ఐఐటీ, నీట్ శిక్షణ పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థ యాజమాన్యాలతో బోర్డు అధికారులు ఏకపక్ష ఒప్పందాలు చేసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కేవలం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేన్న వాదనలున్నాయి. ఒక వైపు అదే ప్రైవేట్ విద్యా సంస్థ… ఇంటర్, ఐఐటీ, నీట్ శిక్షణకు మార్కులతో ప్రమేయం లేకుండా ప్రవేశాల్ని కల్పిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మాత్రం ప్రతిభగల వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామంటున్నారు. ఇది కేవలం విద్యార్థుల ప్రయోజనాల కోసమే చేస్తున్నారా? లేక కార్పొరేట్ విద్యా సంస్థ కోసమేనా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
సంస్కరణలతో ఎవరికి మేలు ?
ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన సంస్కరణలతో ఎవరికి మేలనేదీ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పేరొందిన కార్పొరేట్ విద్యా సంస్థలు ఐఐటీ, నీట్కు శిక్షణ ఇస్తున్నాయి. వాటన్నిటినీ పక్కనబెట్టి… కేవలం ఒకే కార్పొరేట్ విద్యా సంస్థకు అవకాశం కల్పించడం వెనుక ప్రయోజనాలపై తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐఐటీ, నీట్లలో ఓ ప్రైవేట్ విద్యా సంస్థలతో శిక్షణ ఇప్పించడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు. ఇది కేవలం ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న మమకారమా?, లేక వారి ముసుగులో ప్రైవేట్ యాజమాన్యానికి ఆర్థికంగా సహకరించాలన్న వ్యూహం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో… ఇదే తరహాగా మున్సిపల్ హైస్కూళ్ల విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ పేరుతో ఇదే ప్రైవేట్ విద్యా సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆ పథకం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విద్యా సంస్థకు ఈ విడత ఐఐటీ, నీట్ శిక్షణకు ద్వారాలు తెరవడంపై విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఐఐటీ, నీట్తో ఫీజుల దోపిడీ
ఇంటర్తోపాటు ఐఐటీ, నీట్ శిక్షణను అందిస్తూ పెద్దఎత్తున కార్పొరేట్/ ప్రైవేట్విద్యా సంస్థలు ఫీజులు దండుకుంటున్నాయి. విద్యార్థులను సెక్షన్లుగా విభజించి..ఒక్కో బ్యాచ్కు ఒక్కో రకంగా ఫీజులు నిర్ధారిస్తున్నాయి. ఇంటర్తోపాటు ఐఐటీ, నీట్ శిక్షణకుగాను సగటున ఏడాదికి రూ.లక్ష రూపాయల నుంచి రూ.2లక్షల వరకు, హాస్టల్కు అదనంగా మరో లక్షా 50వేల నుంచి రూ.2లక్షలకు ప్రతేటా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీని ఆధారంగా ఇంటర్తోపాటు ఐఐటీ, నీట్ల శిక్షణతో హాస్టల్లో ఉండి చదివే విద్యార్థులకు ఏడాదికి సగటున రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతోంది. రెండేళ్లకు కలిపి రూ.5లక్షల నుంచి రూ.6లక్షలతో బయటపడాల్సి వస్తోంది. డే స్కాలర్స్కు ఏటా రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఫీజులను ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నారు.
అదే కోవలోని ఓ కార్పొరేట్ సంస్థను ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ శిక్షణ కోర్సులకు ఎంపిక చేసింది. ఈ తరహాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఐఐటీ, నీట్కు ఎంపిక చేసిన ఒక్కో విద్యార్థికి ఎంత ఫీజు నిర్ధారించారనేదీ ప్రభుత్వం వెల్లడిరచాల్సి ఉంది. ప్రైవేట్/కార్పొరేట్లో కొనసాగుతున్న తరహాగా… ఈ ప్యాకేజీలో ప్రభుత్వ విద్యార్థులకు బోధన ఉంటుందా?, అదే తరహాగా ఫ్యాకల్టీలు ఉంటారా? అనేది నిశితంగా పరిశీలించాలి.