. తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు
. ర్యాలీలకు మాత్రమే పోలీసులు అనుమతించలేదు
. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించొద్దు
. జగన్ వ్యాఖ్యలను ఖండిరచిన సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ను తిరుమలకు వెళ్ల వద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు మాత్రం చేయవద్దని ప్రభుత్వం చెప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తిరుమల అంశంపై వైఎస్ జగన్ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… నోటీసులు ఇచ్చారు… నిలుపుదల చేశారని జగన్ ఆరోపిస్తున్నారని, పోలీసులు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ ను తిరుమలకు వెళ్లొద్దని పోలీసులు నోటీసులు ఇస్తే వాటిని మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని నిలదీశారు. ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో భక్తులు ఆందోళ నలో ఉన్నారన్నారు. ఈ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని చెప్పారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని అన్నారు. తిరుమల వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు, నియమాలు పాటించాల్సిందేనన్నారు. ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఎవరైనా ఇతర మతాలను గౌరవిస్తూ సొంత మతాన్ని ఆచరించాలన్నారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు మీకు ఉన్నాయా అంటూ వైసీపీని నిలదీశారు. ఇష్టమైతే తిరుమలకు వెళ్లండి లేకపోతే వెళ్లొద్దు అని అన్నారు. తిరుమలకు వెళితే ఆలయ సంప్రదాయాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. నెయ్యి కల్తీ జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నివేదిక ఇచ్చింది ఎన్డీడీబీ అని తాము కాదని తెలిపారు. టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. నాసిరకం పదార్ధాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారని అన్నారు. ఈవో చెప్పలేదు, నివేదికలు లేవు అంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పు జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయాలి కానీ ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. స్వామి వారికి మీరు చేసిన అపచారాలను బయటకు వెల్లడిరచకుండా నేను కప్పిపుచ్చాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.