ఒకే నామినేషన్ దాఖలుతో ఎన్నిక ఏకగ్రీవం
నేడు అసెంబ్లీలో బాధ్యతల స్వీకరణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ శాసనసభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శాసనసభ స్పీకర్ పదవి కోసం చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు బలపరుస్తూ నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కింజారపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల గడువు ముగియడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది.
శనివారం ఉదయం 11 గంటలకు అయ్యన్న స్పీకర్ పదవిపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారు. అనంతరం అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానంలో అధికార, విపక్ష నేతలు కూర్చోబెడతారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లో చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా ఆయన కొనసాగుతున్నారు. కూటమి ఎమ్మెల్యేల్లోనూ ఆయన అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి ఆయన విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం నుంచి ఆయన గెలుపొందారు.