పెగాసస్ స్పైవేర్ నిఘా అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది.ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటివరకు కోర్టులో తొమ్మిది పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటిషనర్లు ఎన్ రామ్, తదితరుల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ అని ఆరోపించారు. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోందని పేర్కొన్నారు. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి అని తెలిపారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైతే ..ఇది తీవ్రమైన విషయమేనని పేర్కొన్నారు. పలువురు దాఖలు చేసిన రిట్ పిటీషన్లలో అంశాలు సరిగా లేవని, అనుభవజ్ఞులు పిటిషన్ దాఖలు చేసినట్లుగా లేదని సీజే అన్నారు. ఫోన్లు హ్యాక్ అయినట్లు తెలిస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.