కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈరోజు ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ వరకు కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు తన తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళి అర్పించారు. ఈ ఉదయం తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న రాజీవ్ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత అక్కడ ఒక మొక్కను నాటారు. అనంతరం తన తండ్రి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రముఖులు డీకే శివకుమార్, కేఎస్ అళగిరి తదితరులు ఉన్నారు.
అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘విద్వేష, విభజన రాజకీయాల కారణంగా..నేను నా తండ్రిని కోల్పోయాను. ఈసారి దేశాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేను. ప్రేమే ద్వేషాన్ని జయిస్తుంది. భయాన్ని నమ్మకం ఓడిస్తుంది. మనందరం ఐకమత్యంగా సవాళ్లను అధిగమమిద్దాం’ అని రాహుల్ ట్వీట్ చేశారు.