. త్వరలో బాధితులను కలుస్తా బ ఎవరూ భయపడొద్దు
. వయస్సుతో పాటు పోరాడే సత్తా ఉంది
. ఓటమి భావన తొలగించాలి
. పార్టీ నేతలకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాబోయే రోజుల్లో కార్యకర్తలను కలుస్తానని, నష్టపోయిన ప్రతి కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తానని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడిరచారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థి తమ వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దని, కార్యక్తలు కష్టాల్లోనూ మనతో ఉన్నారని, జెండాలు మోసి కష్టాలు పడ్డారని, వారికి తోడుగా నిలవాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులతో విస్తృతస్థాయి సమావేశాన్ని జగన్ నిర్వహించారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి జగన్ పూలమాలలేశారు. జగన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్యకర్తలకు తోడుగా ఉండాలని, వారిని పరామర్శించాలని సూచించారు. ఇప్పటికే పార్టీ తరపున వారిని ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని, పార్టీ ఇచ్చే సహాయాన్ని మీరు స్వయంగా అందించాలని కోరారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వాలని, వారిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయని, రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారన్నారు. ఎవరూ భయపడవద్దని, మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులను పిలిచి మాట్లాడాలని సూచించారు. సోషల్ మీడియా కార్యకర్తలను, మన కోసం నిలబడ్డ వలంటీర్లను, వైసీపీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలని కోరారు. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయాలని, మనం ఓడిపోలేదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని, ప్రతి ఇంట్లోనూ వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ఉందని, ప్రతి ఇంటికీ మనం తలెత్తుకుని పోగలమని చెప్పారు. మోసపోతున్న వారికి పార్టీ నేతలు అండగా నిలవాలన్నారు. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలపైనా, సానుభూతిపరులపైనా దాడులు చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారని, వాళ్లందరికీ భరోసా ఇవ్వాలని కోరారు. మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదని, ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలన్నారు.
ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు తప్పిదమే
ఎన్డీఏలో తాను చక్రం తిప్పుతున్నట్లుగా మోదీ పక్కన కూర్చుని చంద్రబాబు కనిపిస్తాడని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం… శిశుపాలుడి పాపాల్లో ఒకటి అని జగన్ వ్యాఖ్యానించారు. అలా అడగలేని మనిషి రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. తనకు వయసుతో పాటు సత్తువ కూడా ఉందని చెప్పారు. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ… ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైసీపీకి, జగన్కు ఎవరూ సాటిరారన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటాలు చేస్తామన్నారు. వైసీపీ సంఖ్యాబలం తక్కువే ఉన్నందున అసెంబ్లీలో మనం చేసేది తక్కువేనని అన్నారు. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో చూస్తున్నామని జగన్ వివరిస్తూ… జగన్ ఓడిపోయాడు, చనిపోలేదని ఒకరు అంటారని తెలిపారు. చచ్చేదాక కొట్టాలని ఇంకొకరు అంటారని, ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉందన్నారు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయని చెప్పారు. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామని, అమలు చేసిన మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లామని చెప్పారు. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చామని వివరించారు. 66 లక్షల మంది పెన్షనర్లకు ఇంటికెళ్లి పంపిణీ చేశామని, 54 లక్షల మంది తల్లులకు అమ్మఒడి అందించామని, 53 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చామని, అయినా వారి ప్రేమలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సమావేశానికి వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారామ్, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, ముత్తంశెట్టి, రోజా, పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు హాజరయ్యారు.