గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్కుమార్, తిరుపతి అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి పి.మురళి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం గుంటూరు, తిరుపతిలో భారీ రోడ్షో, బహిరంగ సభలు జరిగాయి. గుంటూరులో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్పాషా, తిరుపతిలో రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు.
విశాలాంధ్ర`గుంటూరు : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే నాయకులను రానున్న ఎన్నికలలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించేందుకు గుంటూరు పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు. పార్క్ సెంటర్ నుంచి కట్టావారి వీధి, సోమవారి వీధి, మణి హోటల్ సెంటర్, బాలాజీ నగర్ మీదుగా యాదవ బజార్ తదితర కాలనీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. రోడ్ షోలో టాప్ లేని వాహనంపై సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషాతో పాటు గుంటూరు పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్కుమార్, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిష్టీ నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఎర్రజెండాను చేతబూని ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ నినదిస్తూ వాహనాన్ని అనుసరిస్తూ ముందుకు సాగారు. జంగాల అజయ్కుమార్కు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యఅతిధిగా హాజరైన అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.