వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నీట్ యూజీ ఫలితాలను ఇవ్వొద్దని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫలితాలు ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ని ఆదేశించింది.తపకు తప్పుడు సీరియల్ నంబర్లతో ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్లు ఇచ్చారని వైష్ణవి భూపాలీ, అభిషేక్ శివాజీ అనే ఇద్దరు విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారికోసం పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అప్పటివరకు ఫలితాలను విడుదల చేయకూడదని తీర్పునిచ్చింది.దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ‘ఈ ఫలితాల కోసం 16 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కేవలం ఇద్దరి కోసం ఫలితాలను ఆపలేం.’ అని తేల్చి చెప్పింది. ఆ ఇద్దరి విద్యార్థుల సమస్యను మళ్లీ పరిశీలిస్తామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది.