న్యూదిల్లీ : హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం పదకొండు గంటల కల్లా తొలి ఫలితం వెల్లడి కానుంది. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హర్యానా లో 90 శాసనసభ స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హ్యాట్రిక్ విజయం తమదేనని అధికార బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది. హర్యానా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, ఐఎన్ఎల్డీ – బీఎస్పీ, జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగ్గా 1031 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 2 కోట్ల మందికిపైగా ఓటర్లలో 67.90 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరికీ ఆసక్తి ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్` కాంగ్రెస్ కూటమి తప్పక విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
ఆ రెండు ఇండియా ఐక్యసంఘటనలో ఉన్న పార్టీలే. ఇక పీడీపీ… కింగ్ మేకర్గా ఆవిర్భవించడం ఖాయమని భావిస్తోంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ (సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1) జరిగింది. కాగా కశ్మీర్లో ఏ పార్టీకి మెజార్టీ రాబోదని … హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.