Monday, May 20, 2024
Monday, May 20, 2024

మిగులు విద్యుత్‌ అమ్మొద్దు

కేటాయించని విద్యుత్‌’ వాడుకోండి
మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తాం..
సొంత వినియోగదారులకు సరఫరా చేయాల్సిందే..
రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

న్యూదిల్లీ : దేశంలో విద్యుత్‌ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలని మంగళవారం రాష్ట్రాలకు సూచించింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అనేక సూచనలు చేసింది. ‘బొగ్గు కొరత ఆందోళనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేయడకుండా లోడ్‌ సర్దుబాటు కోసం కోతలు విధిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వారు అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలదే. ముందు వారు తమ వినియోగదారులకే సేవలందించాలి. వారంలో ఏడు రోజులూ విద్యుత్‌ అందించాలి. తమ సొంత వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదు’ అని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ‘విద్యుత్‌ కేటాయింపుల మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర ఉత్పత్తి కేంద్రాల వద్ద 15 శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రాలకు కేటాయించకుండా ఉంచడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ అవసరం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం దీన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ ‘కేటాయించని విద్యుత్‌’ను రాష్ట్రాలు ఉపయోగించుకుని తమ ప్రజలకు కరెంట్‌ సరఫరా చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ మిగులు విద్యుత్‌ను అవసరం ఉన్న రాష్ట్రాలకు కేటాయించేందుకు వీలు ఉంటుంది’ అని పేర్కొంది. వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయకుండా విద్యుత్‌ను అధిక ధరకు విక్రయించే రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది. అలా చేసే రాష్ట్రాలకు ‘కేటాయించని విద్యుత్‌’ను ఉపయోగించుకునే వెసులుబాటును ఉపసంహరించి.. దాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img