రాజీనామా చేయాల్సిందే : కిసాన్ సన్సద్ డిమాండ్
జంతర్ మంతర్ వద్ద ముగిసినా… దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగింపు : ఎస్కేఎం
న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని కిసాన్ సన్సద్ ప్రవేశపెట్టింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జంతర్ మంతర్ వద్ద తమ పోరాటం ముగిసినాగానీ దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతుందని పేర్కొంది. సోమవారం సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనలను సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలను రైతులు ముగించారు. తమ ఆందోళనను కొనసాగించేందుకు దిల్లీ పోలీసుల నుంచి అనుమతి కోరాలని అనుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆఫీసు బేరర్ వెల్లడిరచారు. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయని మోదీ ప్రభుత్వం రాజీనామాను కిసాన్ సన్సద్ డిమాండు చేసింది. దిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్లలో రైతుల ఆందోళన కొనసాగుతుందుని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆఫీసు బేరర్ తెలిపారు. ప్రజలుగానీ రైతుల నమ్మకాన్ని పొందేందుకుగానీ అధికారంలో ఉండేందుకుగానీ బీజేపీ ప్రభుత్వానికి అర్హత లేదని బీకేయూ మీడియా ఇంచార్జి ధర్మేంద్ర మల్లిక్ అన్నారు. జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు 200 మంది చొప్పున నిత్యం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. సోమవారంతో జంతర్ మంతర్ వద్ద రైతుల నిరసన ముగిసిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.