పలస్తీనా సంఫీుభావసభలో వామపక్ష అగ్రనేతలు
న్యూదిల్లీ : యుద్ధోన్మాద ఇజ్రాయిల్, అమెరికా దేశాలు పశ్చిమాసియాలో తక్షణమే యుద్ధం ఆపాలని కోరుతూ వామపక్షాలు న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం పలస్తీనా సంఫీుభావ సభ నిర్వహించాయి. ఈ సభకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం) సమన్వయకర్త ప్రకాశ్ కారత్, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఏఐఎఫ్బీ నేత జి.దేవరాజన్, ఆర్ఎస్పీ నేత ఆర్ఎస్ దగార్, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. సీపీఐ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, బీకే కాంగో, ఎన్ఎఫ్ఐడబ్ల్యు ప్రధాన కార్యదర్శి అనీ రాజా తదితరులు పాల్గొన్నారు. డి.రాజా ప్రసంగిస్తూ తక్షణమే గాజా, లెబనాన్లో కాల్పుల విరమణ జరపాలని ఇజ్రాయిల్ను డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్కు మద్దతిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచిందని, గాజాలో 42 వేల మంది హతమయ్యారని, వాస్తవ లెక్కలు మరింత ఎక్కువ ఉంటాయని అన్నారు. ఇందులో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని తెలిపారు. మరోవైపు లెబనాన్, ఇరాన్పై యుద్ధానికి ఇజ్రాయిల్ కాలు దువ్వుతుంటే, అమెరికా వెన్నుదన్నుగా నిలబడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ పలస్తీనా వాసులందరినీ హతమార్చేందుకే గాజాలో మారణహోమం సాగుతోందన్నారు. గాజా, లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఉధృతమవుతున్నాయని, ఎవరూ ఆ దేశాన్ని ఆపడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం ఇజ్రాయిల్ వైపు నిలుస్తూ… భారతదేశ దీర్ఘకాల పలస్తీనా అనుకూల విధానానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇజ్రాయిల్కు మన దేశం డ్రోన్లు సరఫరా చేస్తోందన్నారు. అమెరికా మిత్రదేశాలు, నాటో సభ్యులైన స్పెయిన్, బెల్జియం, బ్రిటన్, ఫ్రాన్స్లు ఇజ్రాయిల్కు ఆయుధాల సరఫరా చేయవద్దని నిర్ణయిస్తే… భారతదేశం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.