. నేనూ వెళుతున్నా
. పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం
. 21 రోజుల్లోనే అనుమతులు
. సీఎం వైఎస్ జగన్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి/దిల్లీ : విశాఖపట్నం రాజధాని కాబోతుందని, తాను కూడా త్వరలో అక్కడకు వెళ్లబోతున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నానని జగన్ అన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును విశాఖలో మార్చి 3,4 తేదీలలో నిర్వహించబోతున్నామని, మీ అందరినీ వ్యక్తిగతంగా ఆ సదస్సుకు ఆహ్వానిస్తున్నానని చెప్పారు. న్యూదిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో మంగళవారం ఏపీ ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సమావేశం జరిగింది. వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం జగన్ మాట్లాడుతూ సదస్సుకు హాజరుకావడంతో పాటు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీతో పాటు సహచరులను ఇతర కంపెనీ ప్రతినిధులనూ ఆ సదస్సుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో చూపించాలన్నారు. అందరం మరోసారి విశాఖపట్నంలో సమావేశమవుదామని చెప్పారు. దౌత్యాధికారులకు, రాయబారులకు, మంత్రివర్గ సహచరులకు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు, వివిధ కంపెనీల ప్రతినిధులకు, ఇతర ఆహ్వానితులకు సీఎం స్వాగతం తెలిపారు. కియా మోటార్స్ ఎండీ, సీఈఓ జిన్ పార్క్, టోరె ఇండస్ట్రీస్ ఎండీ, సీఈఓ యామా గుచీ, క్యాడ్బరీ ఇండియా అధ్యక్షుడు(యూఎస్ఏ) దీపక్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ (ఇటలీ) రోషన్ గుణవర్దన, అపాచీ అండ్ హిల్టాప్ గ్రూప్ (తైవాన్) డైరెక్టర్ సెర్జియో లీ, సెయింట్ గోబియన్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్(ఫ్రాన్స్) తరపున బి.సంతానం తదితరులు రాష్ట్ర పరిస్థితులపై వివరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమని, అక్కడ ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవని వివరించారు. 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. సులభతర వాణిజ్యంలోనూ మూడేళ్లుగా ఏపీ మొదటి స్థానంలో స్థిరంగా ఉందని, పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్తోనే మూడేళ్లుగా ఈ ప్రగతి లభించిందని పేర్కొన్నారు.
దీని ద్వారా పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందన్నదనేది స్పష్టమవుతోందన్నారు. ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, నాలుగు ప్రాంతాల్లో ఆరు పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. వాటికి అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నామని, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తున్నామని, దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉందని, ఇవన్నీ ఏపీలో ఖనిజాధార కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని విశ్లేషించారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమల్లో ఉందని, 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.